Covid: సడెన్గా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఉన్నట్టుండి కొవిడ్ విజృంభిస్తోంది. రోజువారీ కేసులు వెయ్యి దాటేశాయి. బుధవారం ఒక్కరోజే ముగ్గురు మరణించారు. కొవిడ్ కేసులపై కేంద్రం కూడా అలర్ట్ అయింది. ప్రధాని మోదీ ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారంటే.. పరిస్థితి తీవ్రత తెలుస్తోంది. ఇటు ఇన్ఫ్లుయెంజా, అటు కరోనా వైరస్లతో జనం ఆగమాగం అవుతున్నారు. ఆసుపత్రులు మళ్లీ జనంతో కిక్కిరిసిపోతున్నాయి.
దేశంలో కొత్త వేరియంట్ పంజా విసురుతోందని.. ప్రస్తుతం కొవిడ్ కేసులు పెరగడానికి XBB.1.16 వేరియంటే కారణం కావొచ్చని అంటున్నారు. నిర్థారణ కోసం శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 349 కేసులు ఈ కొత్త వేరియంట్వే ఉన్నాయని తేలింది.
ఎక్స్బీబీ.1.16 వేరియంట్కు సంబంధించి రెండు కేసులు జనవరిలో బయటపడ్డాయి. ఫిబ్రవరిలో 140కి పెరిగాయి. మార్చిలో మరో 207 కేసులు వచ్చాయి. మొత్తంగా తొమ్మిది రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల్లో 349 ఎక్స్బీబీ.1.16 వేరియంట్ కేసులు వచ్చాయని ఇన్సాకాగ్ తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 105 కేసులు రాగా.. తెలంగాణ 93 కేసులతో రెండవ స్థానంలో ఉండి కలవరపెడుతోంది. కర్ణాటకలో 61, గుజరాత్ 54 కేసులు బయటపడ్డాయి.
కొవిడ్ తాజా విజృంభణకు కొత్త వేరియంట్ కారణమై ఉండొచ్చని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా సైతం అనుమానం వ్యక్తం చేశారు. తీవ్ర అనారోగ్యం, మరణానికి దారితీయనంత వరకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. కరోనా వైరస్లో మ్యుటేషన్లు జరుగుతున్న కొద్దీ.. ఇటువంటి కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయని చెప్పారు. ప్రజలు బెదిరిపోకుండా.. జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని సూచించారు.
మాస్క్ పెట్టుకోవడం.. తరుచూ చేతులు శుభ్రపరుచుకోవడం.. ముక్కు, కళ్లు, నోట్లో వేళ్లు పెట్టుకోకుండా ఉండటం.. బలవర్థకమైన ఆహారం తీసుకోవడం.. తదితర చర్యలతో వైరస్ ఏదైనా ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అనారోగ్యం బారిన పడితే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని.. సొంతంగా అధిక మోతాదులో యాంటీబయోటిక్స్ వాడటం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.