lead : ప్రజారోగ్యాన్ని హరిస్తున్న అత్యంత ప్రమాదకరమైన పది రసాయనాల్లో సీసం(lead) అతి పెద్ద విలన్. గాలిని, మట్టిని, నీళ్లను.. ఆఖరికి ఆహారాన్ని సైతం ఈ మూలకం విషపూరితం చేస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరించింది.
చిన్నారుల్లో నాడీ వ్యవస్థతో పాటు ఇంటెలిజెన్స్ కోషెంట్(IQ)ను దెబ్బతీస్తోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. లెడ్ కారణంగా తలెత్తిన కార్డియోవాస్క్యులర్(CVD) వ్యాధులతో 2019లో 55 లక్షల మంది చనిపోయారు. అంచనాల కన్నా ఇది ఆరు రెట్లు.
కాగ్నిటివ్ డ్యామేజ్, సీవీడీ మరణాల వల్ల 6 ట్రిలియన్ డాలర్ల విలువైన ఆదాయాన్ని కోల్పోతున్నట్టు తేలింది. సీసం దుష్ఫలితం వల్ల ఐదేళ్ల లోపు చిన్నారులు మొత్తంగా 76.5 కోట్ల ఐక్యూ పాయింట్లను కోల్పోయారని లెక్కగట్టారు.
ప్రపంచంలో ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు సీసం వల్ల వచ్చే విషం వల్ల కోలుకోలేని రోగాల బారిన పడుతున్నారని యునిసెఫ్ తెలిపింది. వీరిలో అత్యధికులు భారత్లోనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల మంది పిల్లలు ఈ విషం బారిన పడుతున్నారు. వీరిలో అత్యధికులు పేద, మధ్య స్థాయి ఆదాయం ఉన్న దేశాల్లోనే నివసిస్తున్నారు.
గర్భస్థ శిశువులతో పాటు అయిదేళ్ల లోపు చిన్నారులు లెడ్ బారిన పడితే జీవితాంతం నరాలు, ఏకాగ్రతకు సంబంధించిన సమస్యలతో బాధపడతారు. అవయవలోపాలు కూడా తలెత్తి చివరకు మరణానికి కూడా దారి తీసే ముప్పును కూడా ఎదుర్కొంటారు.
లెడ్ బ్యాటరీల రీసైక్లింగ్లో చవకబారు విధానాలను అవలంబించడం వలన వనరులు విషతుల్యమయ్యే ప్రమాదం ఎక్కువ. ఇక గనుల తవ్వకాలు, ఈ-వ్యర్ధాలు, సీసంతో కూడిన మసాలా దినుసులు, పెయింట్లు , బొమ్మల ద్వారా కూడా ఇది శరీరంలోకి చేరే అవకాశాలు ఉన్నాయి.
పసుపు, ఎండు మిర్చి వంటి కొన్ని రకాల వంట దినుసులను నిల్వ ఉంచటానికి సీసాన్ని వాడతారు. కొన్నిసార్లు వాటి రంగును పెంపొందించేందుకు కూడా వాడతారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్లో 27.5 కోట్ల మంది పిల్లల రక్తంలో ప్రతి డెసీలీటరుకి 5 మైక్రోగ్రాములను మించి సీసపు స్థాయులు ఉన్నాయని యునిసెఫ్ నివేదిక చెబుతోంది.