దగ్గు.. ఇది సహజంగా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. అయితే మొండి దగ్గు మాత్రం ఎంతకి వదలకుండా చాలా ఇబ్బంది పెడుతుంది. అయితే చాలామంది ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడడానికి భయపడుతుంటారు. దాంతో దగ్గు మాత్రం అలాగే ఉంటుంది. మన ఇంట్లో దొరికే సహజ సిద్ధమైన పదార్థాలతో దగ్గును ఈజీగా నయం చేసుకోవచ్చు. ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి కలిపి ఆ నీటిని గొంతులో వేసుకొని బాగా పుక్కిలించాలి. దీంతో దురద, మంట తగ్గిపోతాయి. తరచూ ఇలా చేయడం వల్ల వైరస్లు కూడా దరిచేరవు. జలుబు కూడా ఉండదు. కనీసం మూడు నుంచి ఐదు సార్లు ఇలా పుక్కిలిస్తే దగ్గు త్వరగా తగ్గుతుంది. ఒక గ్లాసుడు నీళ్లలో రెండు టీ స్పూన్ల నిమ్మరసం, రెండు టీ స్పూన్ల తేనె కలిపి ఆ మిశ్రమాన్ని రోజు రెండుసార్లు ఉదయం సాయంత్రం తాగాలి. దీంతో దగ్గు వెంటనే తగ్గిపోతుంది. దాంతో పాటు శరీరానికి రోగ నిరోధక శక్తి కూడా వస్తుంది. రోజుకు రెండుసార్లు చికెన్ సూప్ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో శ్వాస సమస్యలు, ముఖ్యంగా దగ్గు, జలుబు తగ్గుతాయి. ఈ సూప్లో ఎన్నో యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఒక పాత్రలో నీటిని బాగా ఆవిరి వచ్చేవరకు మరిగించాలి. ఆ తర్వాత అందులో కొన్ని చుక్కల యూకలిఫ్టస్ ఆయిల్ వేయాలి. దీంతో ఆవిరి పట్టుకుంటే దగ్గు, జలుబు, తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే శ్వాసకోశ సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. పాలల్లో పసుపు వేసుకొని మూడు పూటలా తాగితే జలుబు, దగ్గు వదిలిపోతాయి. అలాగే ఒక పాత్రలో నీటిని తీసుకొని కొంచెం అల్లం వేసి మరిగించాలి. ఆ తర్వాత ఆ ద్రవాన్ని వడకట్టి అందులో తేనె, నిమ్మరసం కలుపుకొని తాగితే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలని తీసుకొని వాటిని బాగా నలిపి ఆ మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్ తేనెలో కలిపి తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే రెండు వారాల కంటే ఎక్కువగా దగ్గు, జలుబు ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది.