wheat flour : మనం తినే ఆహార పదార్థాల వల్ల మనకు ఎలాంటి హాని జరుగుతుంది అనేది చాలాసార్లు మనం గుర్తించలేము. ప్రస్తుతం ఉన్న కాలుష్యం వల్ల ప్రతీ ఆహార పదార్థం కలుషితం అయ్యింది అన్నంతవరకే చాలామందికి తెలుసు. కానీ కొన్ని ఆహార పదార్థాల వల్ల మాత్రం ఆరోగ్యానికి తీవ్ర నష్టం జరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందులో చాలావరకు మనం రోజూ తీసుకునేవే కావడం గమనార్హ. ఆ ఆహార పదార్థాల్లో ఒకటి పిండి.
తాజాగా విడుదలయిన ఒక వెబ్ సిరీస్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సప్లై అవుతున్న పిండిలో కార్డిసెప్స్ అనే ఫంగస్ ఉంటుంది. ఇక ఈ పిండితో తయారైన ప్యాన్కేక్స్ లేదా ఇతర ఆహార పదార్థాలు తినడం వల్ల అందరూ జాంబీలుగా మారిపోతారు. ఇదంతా వినడానికే చాలా భయంకరంగా ఉంది కదా..! కానీ ఇదేదీ నిజం కాదు. కట్టుకథ మాత్రమే. ఇకవేళ ఇదే నిజమైతే..? అన్న ఆలోచన పలువురు ఫుడ్ సైంటిస్టులకు వచ్చింది. అందుకే ఆ కోణంలో పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు.
పిండితో తయారు చేసిన ప్యాన్కేక్స్ తినడం వల్ల మనుషులు జాంబీలుగా మాత్రం మారిపోరు కానీ.. పిండి పదార్థాలలో మైకోటాక్సిన్స్ అనే ఫంగస్ ఉంటుందని, అది మనుషుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఫుడ్ సైంటిస్టులు గుర్తించారు. అయితే ఈ పిండిని వంటలో ఎలా ఉపయోగిస్తున్నాం, ఏ విధంగా స్టోర్ చేస్తున్నాం అనే విషయాల వల్ల ఫంగస్ ఎఫెక్ట్ తగ్గిపోతుందని వారు తెలిపారు. మామూలుగా ఎన్నో కూరగాయలలో కూడా ఆరోగ్యానికి హాని కలిగించే కలుషితాలు ఉన్నా.. వాటిని వండుతున్న సమయంలో అవన్నీ దూరమయిపోతాయని వారు గుర్తుచేశారు.
దాదాపు 14 ఏళ్లుగా గోధుమపిండితో చేసిన బ్రెడ్ను మనుషులు తినడం మొదలుపెట్టారు. 10 వేల ఏళ్లుగా గోధుమలను పండించడం కూడా మొదలుపెట్టారు. అయితే మొదట్లో ఈ బ్రెడ్ వల్ల రష్యాలో డ్రంకెన్ బ్రెడ్ అనే వ్యాధి వచ్చింది. డ్రంకన్ బ్రెడ్ వ్యాధి సోకినవారికి తలనొప్పి, కళ్లు తిరగడం, చేతులు వణకడం, అయోమయం, వాంతులు లాంటి లక్షణాలు కనిపించేవి. ఆ తర్వాత కూడా పలు దేశాల్లో గోధుమపిండితో చేసిన ఆహార పదార్థాలు, ముఖ్యంగా బ్రెడ్ వల్ల పలు వ్యాధులు సోకాయని రికార్డులు చెప్తున్నాయి. ఇవన్నీ ఆ ఫంగస్ వల్లే అని శాస్త్రవేత్తలు అంటున్నారు.
గోధుమపిండిలో ఈ ఫంగస్ను అంతం చేయడానికి పలు విధానాలు అందుబాటులో ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. 160 నుండి 170 ఫారెన్హీట్లో మైక్రోఆర్గనిజమ్స్ అనేవి బతకవని వారు నిర్ధారించారు. అయితే ప్యాన్కేక్స్ అనేవి 190 నుండి 200 ఫారెన్హీట్లో, బ్రెడ్స్ అనేవి 180 నుండి 210 ఫారెన్హీట్లో తయారు చేయబడతాయి కాబట్టి అవి ఫంగస్కు దూరంగా ఉంటాయని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేశారు. అందుకే మామూలు పిండిని తినడం అంత మంచిది కాదని వారు సలహా ఇస్తున్నారు.