Copper Water : పూర్వం మన పల్లెటూళ్లలోని వంటింట్లో అనేక అవసరాలకు రాగి పాత్రలను వాడేవారు. ముఖ్యంగా గ్లాసులు, చెంబులు,గిన్నెలు, నీళ్ల బానల మొదలు పూజా సామాగ్రిలో ఎక్కువగా రాగి వస్తువులు కనిపించేవి. కానీ..రాగి పాత్రలు తొందరగా నల్లబడిపోతాయి. వాటిని రోజూ కడగాలనే ఉద్దేశంతో నేడు మనలో చాలా కుటుంబాలు వాటిని అటకెక్కించేశాయి. అయితే.. రాగి పాత్రలు వాడటం.. ముఖ్యంగా రాగి పాత్రలోని నీరు తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.
రాగి పాత్రలో రాత్రంతా నిలువ ఉన్న నీటిని, పరగడుపునే తాగితే బరువు తగ్గుతారు. అలాగే.. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె వేగం నియంత్రణలోకి వస్తుంది. గుండె జబ్బుల బెడద కూడా తగ్గుతుంది. శరీరంలో కాపర్ లోపం తలెత్తితే.. థైరాయిడ్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక రోజూ రాగిపాత్రలోని నీరు ఉదయాన్నే తాగటం వల్ల థైరాయిడ్ ముప్పు తగ్గటమే గాక.. సమస్య ఉన్నప్పటికీ అదుపులో ఉంటుంది. రాగి పాత్రలో నీటిని త్రాగడం వలన జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడటమే గాక పొట్టలోని ప్రారంభదశలో ఉన్న అల్సర్లు తగ్గిపోతాయి.
రాగి పాత్రలోని నీటిలో డయేరియా, జాండిస్ వంటి రోగాలను వ్యాపించే వైరస్ ఉన్నప్పటికీ.. అది నిర్వీర్యమవుతుంది. తద్వారా ఆ రోగాల ముప్పు గణనీయంగా తగ్గుతుంది. రోజూ లేవగానే 2 గ్లాసుల రాగి పాత్రలోని నీరు తాగితే జీవక్రియలు ఉత్తేజితమవుతాయి. దీనివల్ల శరీరపు పిత్త, వాత, కఫ స్వభావాలు అదుపులో ఉంటాయి. చర్మ ఆరోగ్యానికి రాగి పాత్రలోని నీరు ఎంతో దోహదపడుతుంది. ముఖ్యంగా ముడతలు రాకుండా చేస్తుంది.
శరీరపు రోగ నిరోధక శక్తి పెరగటమే గాక.. ఆర్థరైటిస్ ముప్పు తగ్గుతుంది. తామ్ర పాత్రలోని నీరు తాగేవారిలో కిడ్నీ, లివర్ పనితీరు క్రమంగా ఉంటుంది. అలాగే.. ఈ నీరు త్రాగితే శరీరంలోని కేన్సర్ కారక కణాలు నశిస్తాయి. రాగిపాత్రలు వాడేవారు ప్రతిరోజూ వాటిని కడిగి శుభ్రం చేసుకోవాలి. అలాగే.. రాగి పాత్రల్లో నిమ్మ, నారింజ వంటి పుల్లని పండ్ల రసాలు గానీ, మజ్జిగ, పెరుగు వంటివి గానీ నిల్వచేయకూడదు.