Drinking Water: తరచూ భోజనం చేస్తున్న సమయంలో మధ్యలో ఏదో ఒక విధంగా నీళ్లు తాగాల్సి వస్తుంది. కొంత మంది నీళ్లు తాగకుండా అస్సలు భోజనం చేయలేరు, మరికొంత మందికి ఎక్కిళ్లు, గొంతులో భోజనం అడ్డుపడటం వాటి వల్ల తాగుతుంటారు. అయితే చాలా మందికి మాత్రం తరచూ ఒక ముద్ద భోజనం నోట్లో పెట్టుకోగానే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. ఇలా నీళ్లు ఎక్కువగా తాగుతూ ఆహారాన్ని తక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇలాంటివి తరచూ ప్రతీ ఇంట్లో చూస్తూనే ఉంటాం.
ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ పని తీరులో మార్పులు చోటుచేసుకుంటాయి. దీంతో తినే సమయం కంటే ముందే ఆకలి వేస్తుంది. మరోవైపు కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే చాలా మంది మాత్రం ఆహారం తీసుకునే సమయంలో నీళ్లు తాగడం వల్ల ఆహారం బాగా జీర్ణం అవుతుందని అంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.
భోజనం మధ్యలో నీటిని తీసుకోవడం వల్ల రసాయనాల ఘాడం తగ్గి ఆహారం జరిగా జీర్ణం కాకుండా చేస్తుంది. అంతేకాదు ఆహారం జీర్ణం కావడానికి చాలా సమయం తీసుకుంటుంది. మరోవైపు జీర్ణ ఎంజైమ్ లు కూడా దెబ్బతింటాయి. ఇలా గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, అజీర్తి వంటి చాలా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇలా భోజనం మధ్యలో నీళ్లు తీసుకోవడం వల్ల లాలాజలం పలుచనవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల బరువు పెరగడం వంటి సమస్యలు కూడా వస్తాయట. ఇలా క్రమక్రమంగా జీర్ణ వ్యవస్థ బలహీనపడుతుంది.
అంతేకాదు శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు కూడా పెరిగి రక్తంలోని చక్కెర స్థాయిలు కూడా అమాంతం పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల బరువు త్వరగా పెరుగుతారు. దీంతో ఊబకాయం వంటి సమస్యల బారిన పడి జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్ల భోజనం మధ్యలో నీటిని తీసుకోవడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)