Child Health : నేటితరం పిల్లల చేతికి మొబైల్ ఇవ్వనిదే మాట వినడం లేదు. ఫోన్ ఇవ్వకుంటే తిననని, పడుకోనని మారం చేస్తుంటారు. అయితే, రెండేళ్లలోపు పిల్లల్లో 90% మంది ఫోన్ చూస్తూ ఆహారం తింటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అలా చేస్తే పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపడమే కాక సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
చిట్టి కళ్లకు ప్రమాదమే..
చిన్నారులు ఎక్కువగా స్మార్ట్ ఫోన్ చూడటం వల్ల కంటిలోని రెటీనా దెబ్బతింటుంది. దీంతో కళ్లు బలహీనపడి చిన్నప్పుడే కళ్లజోడు పెట్టుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పిల్లలు ఫోన్కు అడిక్ట్ అవ్వడం వల్ల నలుగురితో కలిసి ఆడుకోవడం మానేసి.. ఫోన్ చూడటాన్నే వ్యసనంగా మార్చుకుంటున్నారు. ఇది దీర్ఘకాలంలో ఇతర సమస్యలకు దారి తీయవచ్చు.
జీర్ణక్రియ సమస్యతో ఇబ్బందులు..
ఫోన్ చూస్తూ తినడం వల్ల పిల్లలు ఏం తింటున్నారు? దాని రుచి ఎలా ఉంటుందో కూడా తెలియదు. కొందరు ఫోన్ చూస్తూ.. ఆహారం ఎక్కువగా తింటే.. మరికొందరు తక్కువగా తింటూ పరధ్యానంలో ఉంటున్నారు. దీంతో వారి జీవక్రియ రేటు క్రమేపీ తగ్గుతోంది. ఆహారం ఆలస్యంగా జీర్ణం అయితే చిన్న వయసులోనే మలబద్దకం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి.