Breast cancer:ప్రస్తుతకాలంలో క్యాన్సర్లు కామన్ అయిపోయాయి. మహిళల్లో వివిధరకాల క్యాన్సర్లు ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే బ్రెస్ట్ క్యాన్సర్. మన దేశంలో ప్రతి 4 నిమిషాలకు ఒకరు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రతి 13 నిమిషాలకు ఒకరు చనిపోతున్నారు. ప్రస్తుతం చాలా ఆధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. రొమ్ములో క్యాన్సర్ కణితుల్ని గుర్తించేందుకు మమోగ్రామ్ పరీక్ష చేస్తారు. కొన్ని సార్లు దీనితో కూడా కణితులను గుర్తించడం అసాధ్యం. అందుకే 40 ఏళ్లు దాటిన ప్రతీ మహిళ ముఖ్యంగా తల్లి కావాలనుకుంటున్న వారు, గర్భిణీలు ఎవరికి వారు తమ రొమ్ముల్లో మార్పులను గుర్తించాలి. అనుమానం వస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. బ్రెస్ట్ భాగంలో ఏదైనా గట్టిగా తగిలినా.. నొప్పిగా ఉన్నా వైద్యుడిని సంప్రదిస్తే క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు. రొమ్ముల్లో పాలను ఉత్పత్తి చేసే లోబుల్స్ గ్రంథుల ద్వారా, చనుమొనకు పాలను తీసుకెళ్లే నాళాల ద్వారా క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందుతాయి. బ్రెస్ట్ క్యాన్సర్ను ఈ లక్షణాలతో గుర్తించవచ్చు.. రొమ్ము భాగంలో వాపు, ఒకే చోట లేదా మొత్తంగా వ్యాపించి ఉంటుంది, రొమ్ములో కొంత భాగం ఎప్పుడూ గట్టిపడుతుంది. రొమ్ము చర్మం చికాకు కలిగిస్తూ ఎర్రగా మారుతుంది. చను మొన ప్రాంతంలో ఎరుపు రంగు లేదా పుండ్లు అవుతాయి. చను మొన నుంచి పాలు కాకుండా ఇతర ద్రవాలు వస్తాయి. చంకల కింది భాగంలో గడ్డలు కనిపిస్తాయని వైద్యులు అంటున్నారు. గర్భిణీల్లో అయితే గర్భధారణ సమయంలో లేదా డెలివరీ తర్వాత ఏడాది లోపు రొమ్ము క్యాన్సర్ వస్తుంది. గర్భిణీల్లో క్యాన్సర్ చికిత్స కణితి దశపై ఆధారపడి ఉంటుంది. గర్భంలోపల ఉన్న పిండంపై దుష్ప్రభావాలు ఉండే అవకాశం ఉన్నందున రేడియేషన్ థెరపీని సూచించరు. పిండం మూడు నెలల సమయంలో కీమోథెరపీ, సర్జరీ చేయడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది.