BLOOD DONATION : ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీ కొన్న ప్రమాదం వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఈ విపత్కర పరిస్థితుల్లో స్థానికులు మానవత్వాన్ని చూపించారు. గాయపడిన వారికి రక్తం అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.
బాలేశ్వర్ సమీపంలోని బహానగా బజార్ వద్ద జరిగిన రైలు దుర్ఘటనలో దాదాపు 900 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను బాలేశ్వర్ లోని ప్రభుత్వ ఆసుపత్రితోపాటు సమీప ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారు అక్కడే చికిత్స పొందుతున్నారు. చాలామంది యువకులు శుక్రవారం రాత్రే బాలేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రికి వద్ద వచ్చారు. రక్తదానం చేస్తామంటూ స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. గంటల తరబడి లైన్లలో వేచి ఉన్నారు. క్షతగాత్రులకు రక్తదానం చేస్తున్నారు.
ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులు వేగంగా స్పందించారు. ఘటనాస్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయకచర్యలు చేపట్టారు. బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. తాము దాదాపు 300 మందిని కాపాడామని స్థానికులు తెలిపారు.
ఘటనాస్థలిలో సైన్యం సహాయకచర్యలు కొనసాగిస్తోంది. బోగీల కింద చిక్కుకున్న వారిని బయటకు తీస్తోంది. వారిని ఆసుపత్రులకు తరలించేందుకు 200 అంబులెన్స్ లను అందుబాటులో ఉంచారు. ఇందులో 167 .. 108 వాహనాలు , 20 ప్రభుత్వ అంబులెన్స్లు ఉన్నాయి. 45 మొబైల్ హెల్త్ బృందాలు ఘటనాస్థలంలోనే సేవలు అందిస్తున్నాయి.