Eluru : యువతుల సందడి మధ్య , ఆనందోత్సవాల మధ్య సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. యువతులు ఇంటి ముందు ముత్యాల ముగ్గులతో వాకిళ్లను నింపుతున్నారు. ఇలాంటి ఆనంద వేడుకల సమయంలో ఓ విషాదం చోటుచేసుకుంది. ముగ్గు వేస్తున్న అక్కాచెల్లెళ్ల పైకి లారీ దూసుకెళ్లిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా మండపల్లి మండలం కానుకొల్లులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం భోగి పండుగ సందర్భంగా ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న యువతులపైకి.. ఇటుకల లోడుతో గుడివాడ నుంచి కైకలూరు వెళ్తున్న లారీ వారిపై నుంచి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో పంగిళ్ల తేజస్విని(17) అనే యువతి అక్కడికక్కడే మృతి చెందాగా.. మరో యువతి పల్లవి దుర్గ(18)కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరార్ అయ్యాడు. లారీలో ఉన్న మరో వ్యక్తిని పట్టుకొని గ్రామస్తులు చితకబాది పోలీసులకు పట్టించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సింది.