WIPRO: టెక్ దిగ్గజం విప్రో సంచలన నిర్ణయం తీసుకుంది. పనితీరు బాగోలేని ఫ్రెషర్లకు షాక్ ఇచ్చింది. మొత్తం 452 మందిని తొలగించింది. పని తీరు సరిగా కనబరచకపోవడంతోనే వారిపై వేటు వేసినట్లు విప్రో ప్రకటించింది. శిక్షణ తర్వాత కూడా వారికి సమయం ఇచ్చామని.. అయినా కూడా వారు పనితీరు మెరుగుపరుచుకోకపోవడంతో ఇంటికి సాగనంపామని వెల్లడించింది.
వర్క్ విషయంలో ఉన్నతమైన ప్రమాణాలను పాటిస్తామని విప్రో తెలిపింది. ఈ నియమం ఫ్రెషర్లకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇక మూడో త్రైమాసికంలో కొత్తగా 600 మందిని చేర్చుకోనున్నట్లు ప్రకటించింది. భవిష్యత్తులోనూ నియామకాలను కొనసాగిస్తామని తెలిపింది.
ఇక కొంతకాలంగా ఆర్థిక మాంద్యం వల్ల ఐటీ రంగంలో గందరగోళం నెలకొంది. దిగ్గజ కంపెనీలు సైతం మాంద్యం దెబ్బకు దివాలా తీస్తున్నాయి. ఇప్పటికే గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, ట్విట్టర్ వంటి కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. ఇటీవల మైక్రోసాఫ్ట్ కూడా దాదాపు 11 వేల మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. దీంతో ఐటీ ఉద్యోగుల్లో భయాందోళనలు రేకెత్తుతున్నాయి. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియక అయోమయం అవుతున్నారు.