Significance Of Toli Ekadashi : చైత్రం, వైశాఖం, జేష్ఠ్యం ఈ మూడు మాసాల్లో ఆరు ఏకాదశులు వచ్చాయి. ఇప్పుడు వచ్చేది ఏడో ఏకాదశి కావాలి. కానీ మొదటి ఆరు వచ్చినవి ఉత్తరాయణం కిందకి వస్తాయి. దక్షిణాయానంలో మొదలయ్యే రోజు జూన్ 29న వచ్చేది తొలి ఏకాదశి అవుతుంది. శరీరంలో తల నుంచి నాభి వరకు ఉత్తర భాగమైతే, బొడ్డు నుంచి పాదాల వరకు దక్షిణ భాగం అవుతుంది. అందుకే బంగారు ఆభరణాలు తల నుంచి నాభి వరకు మాత్రమే పెట్టుకుంటారు. బొడ్డు దగ్గర నుంచి పాదాల వరకు వెండి ఆభరణాలు మాత్రమే ధరించాలని చెబుతోంది శాస్త్రం. ఉత్తర, దక్షిణా భాగాలను చూస్తే ఉత్తరానికే ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. దక్షిణ భాగానికి కాస్త తక్కువ ఉంటుంది.
ఉత్తరాయానం అంతా దేవతలకి సంబంధించిన శుభకార్యాలు, వారి పుట్టిన రోజులు మాత్రమే జరుపుకునే అమోఘమైన కాలం. దక్షిణభాగమంతా పితృ దేవతల ఆరాధానకి సంబంధించి కాలంగా చెబుతారు. దక్షిణాయనంలో వచ్చే మొదటి ఏకాదశి కాబట్టే తొలి ఏకాదశిగా ప్రాధాన్యం ఇచ్చారు. తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి. మనం చేసే పాపాలను తెలుసుకునేలా చేస్తాడు ఆ భగవంతుడు. భవిష్యత్తులో సన్మార్గంలో వెళ్లే దారి చూపిస్తాడు. తొలి ఏకాదశి పూజతో దేవుడి కలిగించే ఫలితం ఇది.
ఒక్కో దేవుడికి ఒక్కో తిథిఏర్పాటు చేశారు. అందులో కుమారస్వామికి షష్ఠి, సూర్యభగవానుడికి సప్తమి తిథి, అమ్మవారికి అష్టమి తిథి ఇష్టం. శ్రీమహా విష్ణువుకి ప్రీతిపాత్రమైన తిధి ఏకాదశి. ఈ రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేసి మామిడి ఆకులతో లక్ష్మీదేవికి ఇష్టమైన తులసీదళాలతో పూజను చేయాలి. కృష్ణుడికి ఇష్టమైన ఆవుల పాలతో చేసి నైవేద్యం సమర్పించాలి. ఏకాదశి నాడు శయని ఏకాదశి అంటారు. శ్రీవిష్ణువు యోగ నిద్రలోకి జారుకునే సమయం ఇది. తన భక్తులకి సేవ చేసేందుకు స్వామి యోగ నిద్రలో తపస్సు చేస్తూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ నాలుగు నెలల తపస్సుతో సంపాదించిన శక్తితో స్వామి మిగిలిన 8 నెలలను మనల్ని రక్షించుకుంటూ ఉంటాడు.