Why Did An Asteroid Impact Kill Dinosaurs : డైనోసార్ల గురించి కథలు కథలుగా వింటాం, హాలీవుడ్ సినిమాల్లో చూస్తుంటాం. కానీ అవి ఒకప్పుడు భూమిపై నివసించిన పెద్ద జంతువులు. 6.6 కోట్ల సంవత్సరాల క్రితం భారీ ఉల్క భూమిని ఢీకొట్టడం కారణంగా అవి అంతరించాయని చరిత్ర చెబుతోంది. ఆ ఉల్క 12 కిలోమీటర్ల మేర వెడల్పుతో ఉండడం వల్ల డైనోసార్లను విలుప్తానికి కారణమైంది. విచిత్రం ఏంటంటే ఉల్కి నుంచి క్షీరదాలు, తాబేళ్లు, మొసళ్లు మాత్రం తప్పించుకోగలిగాయి? అవి ఎలా బతికి బయటపడ్డాయి? ఇన్నాళ్లు ఇదే పెద్ద ప్రశ్న. అంతుచిక్కని రహస్యాల్లో ఇది కూడా ఒకటి. కానీ ఈ రహస్యాన్ని ఛేదించారు శాస్త్రవేత్తలు. దీనికి సంబంధించిన వ్యాసాన్ని సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్ ప్రచురించింది.
ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయం పరిశోధకుల ఆధ్వర్యంలోని అంతర్జాతీయ పురాజీవశాస్త్రం, పర్యావరణ శాస్త్రవేత్తల టీం అధ్యయనం చేసింది. ఇందుకోసం వారంతా అమెరికా నుంచి సేకరించిన 1600 శిలాజ రికార్డలను విశ్లేషించారు. క్రెటేషియన్ కాలం (145 మిలియన్ల నుంచి 66 మిలియన్ల సంవత్సరాలు) నుంచి పాలియోజీన్ కాలం (66 మిలియన్ల నుంచి 43 మిలియన్ల సంవత్సరాల క్రితం) చివరి కొన్ని మిలియన్ సంవత్సరాలలో గ్రహశకలం భూమిని తాకిన తర్వాత భూచర, మంచినీటి జీవుల ఆహార గొలుసులు, పర్యావరణ ఆవాసాలను రూపొందించారు. ఇందులో చాలా ఆసక్తికరమైన విషయాలను వారు గుర్తించారు. చాలా చిన్న క్షీరదాలు డైనోసార్లతో కలిసి జీవించేవి. అయితే ఈ క్షీరదాలు వాటి పరిసరాల మార్పుకు అనుగుణంగా మారుతూ వచ్చాయి. కానీ డైనోసార్లు మాత్రం స్థిరంగా గూళ్లను ఏర్పాటు చేసుకుని జీవించసాగాయి. అంటే డైనోసార్లు మార్పుకు అనుగుణంగా తమనుతాము మార్చుకోలేదు అని స్పష్టమైంది. ఉల్కపడిన తర్వాత ఈ గూళ్లన్ని తుడిచిపెట్టుకుపోయాయి. డైనోసార్ల ఆకారం కూడా వాటికి చావుకు కారణమైంది. కానీ చిన్న క్షీరదాలు వాటి మరణాన్ని కూడా తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. మరింత వైవిధ్యమైన ఆవాసాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఉల్క ప్రభావం వల్ల అవి తమ ఆహార నియమాలను మార్చుకున్నాయి. ఫలితంగా అవి బతికి బయటపడ్డాయని సైంటిస్టులు తేల్చారు. ఇక వీటిపై మరింత పరిశోధన కొనసాగిస్తున్నారు.