Subramanya Swamy : ఒకరోజు పార్వతి పరమేశ్వరులను దర్శించటానికి అనేకమంది తాపసులు కైలాసానికి వస్తారు. అందులో దిగంబర రుషులూ ఉండటంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హేళనగా చూసి నవ్వాడు. దానికి పార్వతి పుత్రుడ్ని మందలించి , మర్మాంగాలు సృష్టి వృద్ధి కోసం సృష్టించినవి, జాతికి జన్మస్థానాలని తెలియ చెప్పింది.
తల్లి జ్ఞానబోధతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొంతకాలం సర్పరూపం దాల్చాడు. జీవకణాలు పాముల్లా ఉంటాయని మనకు తెలిసి విషయమే. ఆ తర్వాత వాటికి అధిపతి అయ్యాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. దాని వల్లే జీవకణాల అధిపతి అయిన సుబ్రహ్మణ్యేశ్వరున్ని పూజిస్తే పిల్లలు పుట్టని దంపతులకు సంతానం కలుగుతుంది.
స్కంద షష్టి నాడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం నిర్వహిస్తారు. అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి. విశిష్టమైన ఈ రోజు సుబ్రహ్మణ్యస్వామి పూజ చేసినా, కావడి సమర్పించినా సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టిన రోజు ఉపవాస దీక్ష చేసి భక్తి శ్రద్ధలతో స్వామిని ఆరాధిస్తారు. ఆలయంలో స్వామి వారికి పూజాభిషేకాలు జరిపిస్తారు. పుట్టలో పాలు పోసి బెల్లం, అరటిపండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు. సంతాన ప్రాప్తి కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తప్పకుండా స్తుతించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు తెలియ చేస్తున్నాయి.