Weather Forecast in Telangana And Andhra Pradesh: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఉన్న రెండు ఉపరిత ఆవర్తనాలు ప్రభావంతో సోమవారం పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయి. మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కావొచ్చని, అప్రమత్తంగా ఉండాలని ఇరు రాష్ట్రాల అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని 29 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ప్రధానంగా ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, జనగాం, జగిత్యాల, రంగారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
మరోవైపు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడం బలపడే అవకాశం ఉంది. ఈ మేరకు వచ్చే మూడు రోజులు ఏపీలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూల్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అలాగే, శ్రీకాకుళం, కాకినాడ, విజయనగరం, వైఎస్సార్, తూర్పుగోదావరి, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూల్, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read: హరీశ్ రావుకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్.. ‘నువ్వు ట్రై చేయవా?’