Vehicle sales: దేశంలో నిరుడు వాహనాల అమ్మకాలు దుమ్మురేపాయి. అన్నీ కలిపి ఏకంగా 2 కోట్ల 11 లక్షల 20 వేల 441 వాహనాలు అమ్ముడుపోయినట్లు… వాహన డీలర్ల సంఘం తెలిపింది. 2020తో పోలిస్తే 17 శాతం, 2021తో పోలిస్తే 15.28 శాతం ఎక్కువగా 2022లో వాహనాలు అమ్ముడుపోయినా… కొవిడ్ కన్నా ముందు 2019తో పోలిస్తే 10 శాతం తగ్గాయి. 2019లో 2 కోట్ల 34 లక్షల 17 వేల 776 వాహనాలు అమ్ముడుపోయాయి.
2022లో ప్యాసింజర్ వెహికిల్స్ విభాగం కొత్త రికార్డులు సృష్టించిందని వాహన డీలర్ల సంఘం వెల్లడించింది. ముఖ్యంగా కార్ల అమ్మకాలు అదరగొడితే, ట్రాక్టర్ల అమ్మకాలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరాయని ప్రకటించింది. కానీ, ద్విచక్ర వాహన అమ్మకాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవని వెల్లడించింది. అక్టోబర్, నవంబర్లో బాగా అమ్ముడుపోయిన ద్విచక్ర వాహనాలు… డిసెంబరులో డీలాపడ్డాయని వివరించింది. ద్రవ్యోల్బణం కారణంగా వాహన ధరలు పెరగడం, గ్రామీణ ప్రాంత ఆదాయాలు పూర్తి స్థాయిలో పుంజుకోకపోవడం, ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరగడం లాంటివి… సంప్రదాయ ఇంజిన్తో కూడిన ద్విచక్ర వాహనాల విక్రయాలపై ప్రభావం చూపాయని తెలిపింది.
2022లో ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాలు 16.35 శాతం పెరిగి 34,31,497 యూనిట్లకు చేరాయి. ఈ విభాగం అమ్మకాల్లో దేశంలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. ఇక ద్విచక్ర వాహనాలు మొత్తం 1,53,88,062 యూనిట్లు అమ్ముడుపోయాయి. 2021తో పోలిస్తే ఇది 13.37 శాతం ఎక్కువ.. ఇక కొవిడ్ కారణంగా దెబ్బతిన్న త్రిచక్ర వాహన విభాగం… కాస్త కోలుకుంది. 2019తో పోలిస్తే త్రిచక్ర వాహన విక్రయాల్లో అంతరం తగ్గింది. 2021తో పోలిస్తే త్రీవీలర్ల అమ్మకాలు 71.47 శాతం పెరిగి, 6,40,559 యూనిట్లకు చేరాయి. ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహన అమ్మకాలు కూడా మూడంకెల వృద్ధి సాధించాయి. దీంతో ఈ విభాగంలో ఈవీల వాటా 50 శాతాన్ని మించింది.
మరోవైపు ట్రాక్టర్లు 7.94 లక్షల యూనిట్లు అమ్ముడుపోయి… జీవిత కాల రికార్డు నమోదు చేశాయి. మెరుగైన రుతుపవనాలు, రైతుల వద్ద నగదు లభ్యత, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర, ప్రభుత్వం పెద్ద ఎత్తున పంటలు కొనుగోలు చేయడం… ట్రాక్టర్ల అమ్మకాలు పెరగాడనికి కారణమని చెబుతున్నారు. గత మూడేళ్ల కంటే ఎక్కువగా ట్రాక్టర్ల విక్రయాలు జరగడం విశేషం. ఇక వాణిజ్య వాహనాలు 6,55,696 నుంచి 31.97 శాతం పెరిగి 8,65,344 యూనిట్లకు ఎగశాయి. కమర్షియల్ వెహికిల్స్ సెగ్మెంట్ 2022 మొత్తం వృద్ధి కనబరిచింది.