Vaikunta Ekadasi : కరోనా తర్వాత దేవాలయాలను, పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న మొక్కుల్ని తీర్చుకునేందుకు భక్తులు వస్తూనే ఉన్నారు. కలియుగ దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తుల సంఖ్య పెరుగుతోంది. వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుండటంతో కొత్త ఏడాది ఆరంభం నుంచి ఈ సంఖ్య మరింత పెరుగుతూ వస్తోంది.
భక్తులు రాకతో శ్రీవారి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. సోమవారం ఒక్క రోజే రూ.7.68 కోట్లు వచ్చినట్టు టీటీడీ తెలిపింది. స్వామి వారికి ఇంత పెద్ద మొత్తంలో హుండీ ద్వారా కానుకలు రావడం ఇదే తొలిసారి. గత ఏడాది అక్టోబర్ 23వ రూ.6.31 కోట్ల హుండీ ఆదాయమే ఇప్పటి వరకు అత్యధికం ఉన్న రికార్డు. . ఇప్పుడు ఆ రికార్డ్ బద్దలైంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనానికి ప్రముఖులు పోటెత్తడంతో ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతి ఇచ్చారు. ఒకే రోజు 69,414 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 18,612 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఈ నెల 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుండడంతో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది.
అత్యద్భుతంగా నిర్మించిన యాదాద్రి ఆలయ నిర్మాణం తర్వాత గుట్టకు వెళ్లే వారి సంఖ్య అన్యూహంగా పెరుగుతూ వస్తోంది. వారాంతాల్లోను కాదు మిగిలిన రోజుల్లోను లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహ స్వామి వారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. గత 20 రోజుల్లో రూ. 2 కోట్ల 12 లక్షల 16 వేల 700లు హుండీ ఆదాయం వచ్చింది. 167 గ్రాముల బంగారం 2 కిలోల 600 గ్రాముల వెండి కానుల రూపంలో వచ్చింది. సుమారు లక్షన్నర విలువైన డాలర్లను భక్తుల కానుకల రూపంలో వచ్చింది.