Vaikunta Dwara Darsham: తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఈనెల 22న ఉదయం 9 గంటలకు రోజుకు రెండువేల టికెట్లు చొప్పున ఆన్లైన్లో కోటాను విడుదల చేయబోతున్నారు. భక్తులు శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇవ్వడంతోపాటు రూ.300 దర్శన టిక్కెట్ కొనుగోలు చేయాలని టీటీడీ ఈవో తెలిపారు. ఆన్లైన్లో ఈ టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు మహా లఘు దర్శనం ఉంటుందని వివరించారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 2న శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి.. గతంలో లాగా పదిరోజుల పాటు భక్తులకు వైకుంఠద్వార దర్శనం కల్పిస్తారు. పదిరోజులకు సంబంధించి తిరుపతిలో సర్వదర్శనం టికెట్లు జారీ చేయనున్నారు.
జనవరి 2 నుంచి 11 వరకు రోజుకు 50 వేల చొప్పున 5 లక్షల సర్వదర్శనం టికెట్లు కేటాయిస్తున్నారు. జనవరి 2న రాజ్యాంగ హోదాలో వీఐపీలు స్వయంగా వస్తే మాత్రమే బ్రేక్ దర్శనం.. జనవరి 1న సర్వదర్శనం టికెట్లు ప్రారంభమవుతాయి. అలాగే వైకుంఠ ద్వార దర్శనానికి రోజుకు 25 వేల చొప్పున 2.5 లక్షల రూ.300 దర్శనం టిక్కెట్లు ఆన్లైన్ లో కేటాయించనున్నారు.
టీటీడీ ఆధ్వర్యంలో తిరుమలలో నిర్వహిస్తున్న 7 కల్యాణ మండపాల్లో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉన్నందున 2023, మార్చి ఒకటో తేదీ నుంచి అడ్వాన్స్ బుకింగ్ తాత్కాలికంగా నిలుపుదల చేశారు. వీటిలో ఎస్ఎంసి-226ఎ, ఎస్ఎంసి-226బి, ఎస్ఎంసి-237ఎ, ఎస్ఎంసి-237బి, ఎస్ఎంసి-248బి, ఎటిసి-99, ఎస్ఎంసి-248ఎ, కల్యాణ మండపాలు ఉన్నాయన్నారు. అభివృద్ధి పనులు పూర్తి చేసిన అనంతరం తిరిగి భక్తులకు అడ్వాన్స్ బుకింగ్ కేటాయిస్తామని తెలిపారు. టీటీడీ తయారు చేస్తున్న పంచగవ్య ఉత్పత్తుల విశిష్టతను తెలియజేసేందుకు వీలుగా ప్రత్యేకంగా వర్క్ షాప్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.ఈ ఉత్పత్తులకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఎస్వీబీసీలో ప్రోమోలు రూపొందించి ప్రసారం చేయనున్నారు. మహిళలకు, వయసు పైబడిన వారికి కేటగిరీల వారీగా ఈ ఉత్పత్తులను విభజించనున్నారు.