US Visa: అమెరికా వెళ్లాలని ఉవ్విళ్లూరే భారతీయులకు బ్యాడ్ న్యూస్. వీసా అప్లికేషన్ ఫీజులను భారీగా పెంచేందుకు బైడెన్ సర్కారు సిద్ధమైంది. కొత్త ధరలపై ప్రతిపాదనలు కూడా చేసింది. మరో 2 నెలల్లో ఇవి అమల్లోకి వస్తాయని అంటున్నారు. అదే జరిగితే… అమెరికా వెళ్లే భారతీయులపై ఆర్థిక భారం భారీగా పడటం ఖాయం.
ఇమ్మిగ్రేషన్ ఫీజుల పెంపు ప్రతిపాదనలను… అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం వెబ్సైట్లో పెట్టింది. H-1B వీసా దరఖాస్తు ధరను 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు… L-1 వీసా ధర 460 డాలర్ల నుంచి ఏకంగా 1385 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించారు. O-1 వీసా ధరను 460 డాలర్ల నుంచి 1,055 డాలర్లకు పెంచాలని భావిస్తున్నారు. ఇక H-2B వీసా ధరను 460 డాలర్ల నుంచి 1,080 డాలర్లకు పెంచాలని ప్రపోజల్ పెట్టారు. ఈ ధరల్ని చూసిన వాళ్ల మైండ్ బ్లాకైపోతోంది.
ఈ ప్రతిపాదనలను 60 రోజుల పాటు వెబ్సైట్లో ఉంచి.. అందరి అభిప్రాయాలను స్వీకరిస్తారు. ఆ తర్వాత పెంపు నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖర్చు భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగానే ఫీజులను పెంచాలని ప్రతిపాదించినట్లు యూఎస్సీఐఎస్ వెల్లడించింది. ఈ నిర్ణయం వల్ల పెండింగ్ వీసాల సంఖ్య కూడా తగ్గే అవకాశముందని తెలిపింది. యూఎస్సీఐఎస్కి 96 శాతం నిధులు… వీసా దరఖాస్తు ఫీజుల ద్వారానే వస్తాయి. 2020లో కొవిడ్ కారణంగా వీసా దరఖాస్తులు భారీగా తగ్గిపోవడంతో… ఆదాయం ఏకంగా 40 శాతానికి పైగా పడిపోయింది. నిధులు లేకపోవడంతో… కొత్త నియామకాలను కూడా నిలిపివేసింది. సిబ్బందిని కూడా తగ్గించుకోవడంతో… వీసా దరఖాస్తులు భారీగా పేరుకుపోతున్నాయి. ఈ సమస్యలన్నింటినీ అధిగమించాలంటే… వీసా దరఖాస్తు ఫీజుల్ని పెంచడం ఒక్కటే మార్గమన్న నిర్ణయానికి వచ్చిన బైడెన్ సర్కారు… ఆ మేరకు ప్రతిపాదనలు చేసింది. ఇక అమలు చేయడమే తరువాయి.