Uber : ప్రయాణ దూరం, సమయం బట్టి క్యాబ్ ఛార్జీలు ఉండటం గమనిస్తుంటాం. ఒక్కోసారి తక్కువ దూరానికీ ఎక్కువ ధరను చూపిస్తుంటాయి క్యాబ్ లు. అలాంటి సమయంలో ఛార్జి తగ్గించాలని బేరమాడే సదుపాయం ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదూ. కానీ.. ఆన్లైన్లో అలాంటి సౌకర్యం ఉండదు. రైడ్ బుక్ చేసుకున్న సమయంలో ఎంత డబ్బు చూపిస్తే అంత చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉబర్ కొత్త ఫీచర్ను తీసుకొస్తోంది. యూజర్ ఎంత ధర పెట్టాలనుకుంటున్నాడో అంతకే క్యాబ్ బుక్ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చేందుకు ఉబర్ సన్నాహాలు చేస్తోంది.
‘ఉబర్ ఫ్లెక్స్’ పేరుతో ఈ కొత్త ఫీచర్ను పరీక్షిస్తుంది. రైడ్ బుక్ చేసుకున్న తర్వాత సాధారణంగా కనిపించే ధరలకు బదులుగా తొమ్మిది విభిన్న ధర ఎంపికలు కనిపిస్తాయి. వాటిలో ఒకటి మాత్రం డీఫాల్ట్గా ఉంటుంది. ఇక రైడ్ బుక్ చేసుకునే వ్యక్తి ఈ తొమ్మిదింట్లో నచ్చిన ధరను ఎంచుకోవచ్చు. రైడర్ ఎంచుకున్న ధర డ్రైవర్కి నచ్చితే తను అంగీకరిస్తాడు లేదా తిరస్కరించవచ్చు. ఇలా నచ్చిన ధరతో రైడ్ బుక్ చేసుకునే ఆప్షన్ ను ఉబర్ తీసుకువస్తుంది. ఇకపై డ్రైవర్లకు, కస్టమర్లకు రైడ్ ధరను ఎంచుకునే విషయంలో స్వేచ్ఛ ఉంటుంది.
ఉబర్ కస్టమర్లు తమ రైడ్ ధరల ఎంపికపై నియంత్రణ కల్పించటం కోసం ఈ ఫీచర్ను తీసుకొస్తుంది. తక్కువ ధరకే రైడర్లు ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది. ప్రయాణించిన తర్వాత నగదు లేదా డిజిటల్ పద్ధతి ద్వారా చెల్లింపులు చేయవచ్చు. గతేడాది అక్టోబరులోనే ఉబర్ ఫ్లెక్స్ ఫీచర్ టెస్టింగ్ను ప్రారంభించింది. ఉబర్ ఓ ప్రకటనలో ఔరంగాబాద్, ఆజ్మీర్, బరేలీ, చండీగఢ్, కోయంబత్తూర్, డెహ్రాడూన్, గ్వాలియర్, ఇండోర్, జోధ్పుర్, సూరత్ ప్రాంతాల్లో ఈ ఫీచర్ ను పరీక్షించినట్లు తెలిపింది. త్వరలో ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో కూడా ఈ సేవల్ని పరీక్షించనుంది. భారత్తో పాటు లెబనాన్, కెన్యా, లాటిన్ అమెరికా వంటి దేశాల్లో ఈ ఫీచర్ని పరీక్షిస్తోంది.