Twitter 2.0 : అనేక వివాదాస్పద నిర్ణయాల తర్వాత ఎట్టకేలకు ట్విట్టర్ యూజర్లకు కొత్త ఫీచర్లు పరిచయం చేయబోతున్నాడు… ఎలాన్ మస్క్. ట్విట్టర్ 2.0ను సరికొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు. కొత్తగా పేమెంట్స్ ఆప్షన్ తీసుకురావడంతో పాటు, టెక్ట్స్ లిమిట్ కూడా పెంచే
అవకాశాలు కనిపిస్తున్నాయి.
ట్విట్టర్ 2.0లో అక్షరాల పరిమితిని 280 నుంచి 420కి పెంచుతారా? అంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్కు… మంచి ఆలోచన అని సమాధానమిచ్చాడు… మస్క్. ఆయన ఇంత సానుకూలంగా స్పందించాడంటే… త్వరలో ట్విట్టర్లో అక్షరాల పరిమితిని పెంచడం ఖాయమని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. గతంలో ఒక ట్వీట్లో 140 పదాల వరకే పరిమితి ఉండేది. 2018లో దాన్ని 280కి పెంచారు. తాజాగా దీన్ని 420కి పెంచుతారని నెట్టింట్లో చర్చ మొదలైంది. ట్విటర్కు సంబంధించి కొత్తగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా… మస్క్ పోల్ నిర్వహిస్తున్నారు. ట్వీట్లో అక్షరాల పరిమితి పెంచాలా? వద్దా? అనే అంశంపై కూడా మస్క్ పోల్ నిర్వహించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు… మస్క్ ట్విట్టర్ను కొనకముందే… నోట్స్/ఆర్టికల్స్ అనే ఫీచర్లు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది… పాత యాజమాన్యం. బ్లాగ్ తరహాలో యూజర్లు తాము చెప్పాలనుకున్న కంటెంట్ను ఒకే దాంట్లో రాసేలా మార్పులు చేయాలనుకున్నారు. గరిష్ఠంగా 2500 అక్షరాల దాకా రాసుకునేలా కొత్త ఫీచర్ ప్రవేశపెట్టబోతున్నారని ప్రచారం జరిగినా… ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. ఇది ఇప్పుడు అందుబాటులోకి రావొచ్చని యూజర్లు ఆశిస్తున్నారు.
ట్విట్టర్ కొన్నాక వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన మస్క్… 2.0 కోసం కొత్తగా నియామకాలు చేపట్టబోతున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కొరత తీవ్రంగా ఉండటంతో… కోడింగ్ అనుభవం ఉన్న ఉద్యోగులెవరైనా తన కొత్త టీమ్లో చేరొచ్చని మస్క్ ఆఫర్ ఇచ్చాడు. అయితే, సంస్థలో కొత్తగా ఎంత మంది చేరారనే దానిపై ఎలాంటి వివరాలూ బయటికి రాలేదు.