Twitter suspends journalists : ఎలాన్ మస్క్ కు కోపం వచ్చింది. అంతే… అమెరికా జర్నలిస్టుల ట్విట్టర్ ఖాతాలు గల్లంతైపోయాయి. ఒకరు, ఇద్దరు కాదు… ఏకంగా 12 మంది జర్నలిస్టుల ఖాతాలను సస్పెండ్ చేసి పారేశాడు… మస్క్. అతను ట్విట్టర్ ను కొన్నప్పటి నుంచి… అతని నిర్ణయాలను, సంస్థలో జరుగుతున్న మార్పులను వ్యతిరేకిస్తూ కథనాలు రాస్తున్న జర్నలిస్టుల ట్విట్టర్ అకౌంట్లన్నీ… ఇప్పుడు నిస్తేజంగా మారాయి.
న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్ ర్యాన్ మాక్, వాషింగ్టన్ పోస్ట్ రిపోర్టర్ డ్రూ హార్వెల్, CNN రిపోర్టర్ డోనీ ఓసుల్లివన్, మాషబుల్ రిపోర్టర్ మాట్ బిండర్ సహా… మరో 8 మంది జర్నలిస్టుల ట్విట్టర్ ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేయించాడు… మస్క్. ట్విట్టర్లో ఆయా జర్నలిస్టుల ఖాతాలు సస్పెండ్ అయినట్లు నోటీసులు కనిపిస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరం అంటూ జర్నలిస్టులతో పాటు వాళ్లు పనిచేసే వార్తా సంస్థలు కూడా మస్క్ చర్యను తప్పుబట్టాయి. జర్నలిస్టుల ఖాతాలన్నీ పునరుద్ధరించి, ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది? అన్న ప్రశ్నకు ట్విట్టర్ సంతృప్తికరమైన వివరణను అందిస్తుందని ఆశిస్తున్నామన్నాయి. కానీ… మస్క్ రియాక్షన్ మాత్రం వేరుగా ఉంది.
జర్నలిస్టుల ట్విట్టర్ ఖాతాల సస్పెన్షన్ మీద వెల్లువెత్తిన విమర్శలకు… మస్క్ గట్టిగానే సమాధానం ఇచ్చాడు. డాక్సింగ్ నియమాలు అందరితో పాటు జర్నలిస్టులకు కూడా వర్తిస్తాయని, ఇందులో ఎలాంటి మినహాయింపు లేదని మస్క్ కౌంటర్ ఇచ్చాడు. తనను రోజంతా విమర్శించడం మంచిదేనన్న మస్క్… తాను ఎక్కడున్నా? ఏం చేస్తున్నా? అన్నది అనుక్షణం కనిపెట్టడం… తనకు, తన కుటుంబానికి హాని కలిగించలేదని అన్నాడు. తన ప్రైవేట్ జెట్ లైవ్ లొకేషన్ ను ట్రాక్ చేసే ఖాతాను సస్పెండ్ చేశాక… మస్క్ ఈ కామెంట్ పెట్టాడు. మొత్తానికి తన చర్యలతో ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న మస్క్… ఇప్పుడు జర్నలిస్టుల ట్విట్టర్ ఖాతాలు స్తంభింపజేసి, మరోసారి చర్చ జరిగేందుకు కారణమయ్యాడు.