Twitter shocks: డాక్సింగ్ నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంతో వివిధ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టుల ఖాతాలను సస్పెండ్ చేసిన ట్విట్టర్… తన పోటీ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్స్ అయిన మాస్టోడాన్, ‘కూ’ లకు కూడా షాకిచ్చింది. ఆ రెండింటి ట్విట్టర్ ఖాతాలపై వేటు వేసింది. కూ యాప్ వాడాలని అనుకునే వారి సందేహాలు నివృత్తి చేయడానికి కొన్నాళ్ల కిందటే @kooeminence పేరుతో ఆ సంస్థ ట్విటర్లో ఖాతా తెరిచింది. దానితో పాటు మాస్టోడాన్ ట్విట్టర్ అకౌంట్ను కూడా సస్పెండ్ చేయించాడు… మస్క్.
ట్విట్టర్ తీరుపై కూ సహ వ్యవస్థాపకుడు మయాంక్ అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే సమాచారాన్ని పోస్ట్ చేయడం డాక్సింగ్ కిందికి రాదన్న ఆయన… జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వారిని ట్విట్టర్ నుంచి నుంచి తొలగించడం అనేది చెత్త విషయం అని ఘాటుగా స్పందించాడు. తనకు మాత్రమే నచ్చే నచ్చే విధానాలను మస్క్ రూపొందించడం దారుణమని, ఏ రోజుకారోజు ఆయన సిద్ధాంతాలను మార్చుకోవడం అస్థిరత్వమని మండిపడ్డారు. చర్చలకు చెక్ పెట్టేందుకు రాత్రికి రాత్రే ఖాతాలపై వేటు వేస్తున్నారని, ఇలా చెప్పుకుంటూ పోతే ట్విట్టర్ కొత్త యాజమాన్యం చెత్త నిర్ణయాలు ఇంకెన్నో ఉన్నాయన్నారు… మయాంక్. ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదని, ఆధిపత్యం కోసం చేస్తున్న ఇలాంటి చర్యల్ని ఎప్పటికీ ఒప్పుకోకూడదని… కచ్చితంగా దీనిపై గళమెత్తాల్సిందేనని మయాంక్ అభిప్రాయపడ్డారు.
‘కూ’ ఎప్పటికీ పక్షపాత విధానాలను రూపొందించదన్న మయాంక్… ట్విటర్ ఇక మాధ్యమంగా కాకుండా పబ్లిషర్గా మారిందని విమర్శించారు. ట్విట్టర్కు ఉత్తమమైన ప్రత్యామ్నాయం కూ ప్లాట్ఫామ్ మాత్రమే అని చెప్పారు. యూజర్ల వ్యక్తిగత వివరాలను పంచుకోవడాన్ని నిషేధిస్తూ ట్విట్టర్ నిబంధనలు రూపొందించింది. వీటినే డాక్సింగ్ రూల్స్గా వ్యవహరిస్తున్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంతో చాలా మంది జర్నలిస్టుల అకౌంట్లను ట్విట్టర్ తాత్కాలికంగా నిలిపివేసింది.