Turmeric : ఒకప్పుడు ఈ టెక్నాలజీ అంతా లేని సమయంలో ఇంట్లో ఉన్న పదార్థాలతో, ప్రకృతిసిద్ధంగా దొరికే వనరులతోనే వైద్యం జరిగేది. అలాంటి వైద్యమే అన్నింటికంటే మెరుగైనదని ఇప్పటికీ ఆ తరం వారు చెప్తుంటారు. అది పూర్తిగా కొట్టిపారేయలేని విషయమని వైద్యులు కూడా అంటుంటారు. ఇప్పటికీ దెబ్బ తగలగానే చాలామంది గాయానికి పసుపు రాస్తుంటారు. ఈ పసుపు అనేది ఎన్నో విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని నమ్ముతారు. అయితే ఈ పసుపు వల్ల కలిగే మరికొన్ని ప్రయోజనాలను శాస్త్రవేత్తలు బయటపెట్టారు.
పసుపు అనేది ముఖ్యంగా శారీరికంగా ఎక్కువ శ్రమపడే క్రీడాకారులకు చాలా మంచిదని నాట్టింగమ్ ట్రెంట్ యూనివర్సిటీ పరిశోధకులు చెప్తున్నారు. రోజుకు రెండుసార్లు 60 ఎమ్ఎల్ పసుపు నీరు తాగడం వల్ల క్రీడాకారులు ఫిట్గా ఉంటారని, ఆట బాగా ఆడగలుగుతారని అన్నారు. ముఖ్యంగా సాకర్ లాంటి గేమ్స్లో కండరాల బలం చాలా కావాల్సి ఉంటుంది. ఒకవేళ తగిన బలం లేకుండా ఫీల్డ్లోకి దిగితే మాత్రం.. కండరాలకు జరిగే డ్యామేజ్ను ఊహించడం కూడా కష్టమే. ఒక్క గాయం అయినా కూడా వారు తిరిగి కోలుకొని ఆటలోకి దిగడానికి చాలా సమయం పడుతుంది. అలాంటి వారికి పసుపు ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
కండరాలు తీవ్రంగా కలిగే వ్యాయామం లాంటివి చేసిన తర్వాత కూడా పసుపు కలిపిన నీరు తాగడం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇది రక్తంలోని సైటాకిన్స్ అనే ప్రొటీన్స్ శాతాన్ని పెంచుతుందని, దాని కారణంగా వ్యాయమం వల్ల కలిగే ఒత్తిడి దూరమయిపోతుందని అంటున్నారు. పసుపులో ఉండే సప్లిమెంట్ ద్వారా వ్యాయమం వల్ల కలిగే ఒత్తిడి దూరమవుతుందని మొదటిసారి శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ పరిశోధనల కోసం వారు రెండు గ్రూపులను తీసుకొని ఒకరికి పసుపు నీరు, మరొకరికి ఇవ్వకుండా గమనించారు. ఇందులో కూడా వారు అనుకున్నదే నిజమని తేలింది.
ఒక్కొక్కసారి క్రీడాకారులు ఎక్కువగా విశ్రాంతి లేకుండా ఆడవలసి ఉంటుంది. ఒకటి తర్వాత ఒకటి మ్యాచ్లు జరుగుతూనే ఉంటాయి. అలాంటి సమయంలో వారు ఫిట్గా ఉండడం ముఖ్యం. అప్పుడే రోజుకు రెండుసార్లు పసుపు నీరు తీసుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు. మామూలుగా వ్యాయమం వల్ల కలిగే ఒత్తిడిని దూరం చేయడానికి మార్కెట్లో ఎన్నో మందులు ఉన్నాయి. కానీ నేచురల్గా పసుపు నీరు తీసుకోవడమే మంచిదని వారు చెప్తున్నారు. పైగా ఇలాంటి నేచురల్ పద్ధతి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని గుర్తుచేశారు.