TTD Annaprasada : శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నిర్విఘ్నంగా అన్నప్రసాద వితరణ జరగాలని ప్రార్థిస్తూ గురువారం ఆయుధపూజ నిర్వహించారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదాల తయారీకి వినియోగించే సామగ్రికి, యంత్రాలకు పూజలు చేశారు.
నిత్యం వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతున్న క్రమంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని భగవంతుని ప్రార్థిస్తూ ప్రతి సంవత్సరం అన్నప్రసాద భవనంలో సాంప్రదాయబద్ధంగా ఆయుధపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నదన్నారు.1983లో అన్నదానం ప్రారంభమైంది. 2009లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనం నిర్మించి రోజుకు దాదాపు 14 గంటల పాటు నిరంతరాయంగా భక్తులకు అన్న ప్రసాదాలు అందిస్తున్నారు.
తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కోసం తరలివస్తున్న భక్తులకు రోజూ దాదాపు 80 వేల మందికి ఉచితంగా భోజనం వడ్డిస్తోంది. తిరుమలలో ఎవరూ ఆకలితో ఉండకూడదన్నది టీటీడీ లక్ష్యం. అందుకే ఏ సమయంలో భోజనానికి వెళ్ళినా దొరికే ఏర్పాటు చేశారు.నిత్య అన్నదానం దాతలు కోసం భారీగా విరాళాలు ఇస్తున్నారు.
తిరుమలలో అన్నదానానికి 500 యేళ్ళ క్రితమే పునాది పడింది. మొదట చంద్రగిరి ప్రభువుగా, ఆపై విజయనగర రాజుగా క్రీ.శ.1450 నుంచి క్రీ.శ.1493 నుంచి 44 యేళ్ళపాటు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన సాలువ నరసింగరాయలు కూడా శ్రీవారి భక్తుడు. ఆయన హయాంలోనే తిరుమల, తిరుపతిలో ఉచిత భోజనశాలలు ఏర్పాటు చేశారు. వీటికి రామానుజ కూటములు అని పేరు పెట్టారు. సాళువ నరసింగరాయలు తిరుమలలో బ్రాహ్మణేతరుల కోసం ఒక భోజనశాల ఏర్పాటు చేశారు. దీనికి సత్రం అని పేరు పెట్టారు. ఆలయాన్ని అభివృద్థి చేసే క్రమంలో సత్రం కనుమరుగైంది.