Paralysis : పక్షవాతం.. ఇది మెదడులోని ఓ భాగం రక్తనాళం పగిలినప్పుడు వస్తుంది. దీంతో దీర్ఘకాలిక వైకల్యం సంభవిస్తుంది. అంతేకాకుండా మరణానికి కూడా దారి తీస్తుంది. పక్షవాతం వచ్చేముందు సంకేతాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడం చాలా అవసరం. స్ట్రోక్ లక్షణాలు తేలికపాటివిగా ఉంటాయి. నిర్దిష్టంగా కూడా ఉండవు. పక్షవాతం వచ్చే ముందు వెర్టిగో, మైకంవంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి కొన్ని రోజుల నుంచి వారాల వరకు ఉంటాయని వైద్యులు అంటున్నారు. పరిస్థితి మరింత దిగజారినప్పుడు తల తిరగడం, మైకం, తీవ్ర నీరసం వస్తుంది. స్ట్రోక్ జర్నల్లో ప్రచురించిన ఓ నివేదికలో వెస్టిబ్యులర్ సిండ్రోమ్ ఎపిసోడ్స్ సంకేతాలుగా వీటిని గుర్తించారు. తరచుగా వికారం, అకస్మాత్తుగా పడిపోవడం కూడా జరుగుతుందని చెబుతున్నారు. ఈ లక్షణాలు సెకన్ల నుండి గంటలు, కొన్ని సందర్భాల్లో రోజుల వరకు కూడా ఉంటాయంటున్నారు. చేతుల్లో బలం లేకపోవడం, కాళ్లు, శరీరం బలహీనత పదాలను తడబడుతూ చెప్పడం, మర్చిపోవడం, ఒక్కసారిగా తీవ్ర తలనొప్పి, దృష్టి పోవడం, జ్ఞాపకశక్తి తగ్గడం కూడా పక్షవాతం లక్షణాలే అంటున్నారు. అయితే పక్షవాతం రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది ఇస్కిమిక్ స్ట్రోక్.. ఇది మెదడుకు రక్తం సరఫరా చేసే నాళాల్లో గడ్డలు ఏర్పడటం వల్ల సంభవిస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ కేసులలో 85 శాతం ఇలాంటివే. ఇక రెండోది హీమరేజిక్ స్ట్రోక్.. మెదడులో నరాలు చిట్లడంతో రక్తస్రావం జరిగినప్పుడు వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ కేసులలో ఇది 15శాతం ఉంటుంది. ఈ రెండు రకాల స్ట్రోక్లు ఒకే రకమైన లక్షణాలతో ఉంటాయి. మరోవైపు పక్షవాతం అంటే భయపడాల్సిన పనిలేదు.. రోగిని తొందరగా ఆస్పత్రికి తీసుకెళ్తే ప్రాణాలు కాపాడుకోవచ్చని వైద్యులు అంటున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ చికిత్సలు నిర్ణీత సమయంలోపే చేయాలంటున్నారు. ఆలస్యం చేసిన ప్రతి నిమిషానికి మెదడులోని 20 లక్షల న్యూరాన్లను రోగి నష్టపోతాడని చెబుతున్నారు. సాధ్యమైనంత త్వరగా మెదడుకు రక్త ప్రసరణ జరిగేలా చూడాలని, అప్పుడే మెదడు కణాలు నశించకుండా నివారించవచ్చని వైద్యులు అంటున్నారు.