Mukesh Ambani:భారత కార్పొరేట్ దిగ్గజాలనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ముకేశ్ అంబానీ. భారత కుబేరుడు అన్నా గుర్తొచ్చేది ఆయన పేరే. ఆ పేరు సంపాదించుకోవడానికి ఆయన పడిన కష్టం అంతా ఇంతా కాదు. నిరంతర శ్రామికుడాయన. ఆయిల్ అండ్ పెట్రో కెమికల్స్ వ్యాపారంలో ఉన్న రిలయన్స్ను అన్ని రంగాల్లోనూ అగ్రగామి సంస్థగా తీర్చిదిద్దడమే కాదు.. మధ్యతరగతి భారతీయులకు ఎన్నో రకాల సేవలను అందుబాటులోకి తెచ్చిన ఘనత కూడా ఆయన సొంతం. తండ్రి మరణంతో రిలయన్స్ బాధ్యతలు చేపట్టి 20 ఏళ్లు అయ్యింది. ఈ రెండు దశాబ్దాల కాలంలో రిలయన్స్ సాధించిన రికార్డులు చూస్తే ఎవరైనా ముకేశ్ అంబానీకి హ్యాట్సాప్ కొట్టాల్సిందే.
20 ఏళ్లలో రిలయన్స్ ఆదాయం 17 రెట్లు.. లాభాలు 20 రెట్లు పెరిగాయి.
2002 మార్చి నాటికి రూ.41,989 కోట్లుగా ఉన్న కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2022 మార్చి నాటికి రూ.17,81,841 కోట్లకు చేరింది. అంటే.. ఏకంగా 42 రెట్లు పెరిగిందన్నమాట.
2002 మార్చి నాటికి రిలయన్స్ లాభాలు రూ రూ.3,280 కోట్లు ఉంటే.. 2022 మార్చి నాటికి రూ.67,845 కోట్లకు పెరిగాయి. అంటే లాభాల్లో పెరుగుదల 20 రెట్లన్నమాట.
2006లో రిటైల్ రంగంలోకి ప్రవేశించారు. రిలయన్స్ ఫ్రెష్తో మొదలైన రిటైల్ వ్యాపారం ఇప్పుడు అన్నిరంగాల్లోకి విస్తరించింది. కూరగాయల దగ్గర నుంచి మొదలుపెడితే వంటిటి సరుకులు, ఎలక్ట్రానిక్స్, దుస్తులు, అభరణాలు అన్నింటినీ అమ్మే కంపెనీగా రిలయన్స్ను తీర్చిదిద్దారు.
2016లో జియో లాంచ్తో టెలికాం రంగంలోకి రిలయన్స్ను రీలాంచ్ చేశారు ముకేశ్ అంబానీ. తమ్ముడు ఓడిపోయిన చోటే గెలవడమే కాదు.. భారత టెలికాం రంగంలో జియోను నెంబర్వన్ ప్లేస్లో నిలబెట్టిన తన సత్తా చాటుకున్నారు. మొబైల్ డాటా ఇంత చౌకగా మనకు అందుబాటులో ఉందంటే దానికి కారణం ముకేశ్ అంబానీనే. ప్రపంచంలోనే అత్యధికంగా డాటా వినియోగించే దేశాల జాబితాలో టాప్ ప్లేస్కు భారత్ చేరుకోవడానికి కారణం ఆయనే. 2016లో 150వ స్థానంలో ఉన్న భారత్ 2018లో ఏకంగా అగ్రస్థానానికి చేరింది.
2021లో సాంప్రదాయేతర ఇంధనం రంగంలోకి ప్రవేశించారు. భవిష్యత్తులో డిమాండ్ ఉంటుందనుకున్న హరిత ఇంధనంపై వచ్చే మూడేళ్లలో రూ. 75 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత చౌకగా సౌర విద్యుత్తు, గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ ఏడాది మెట్రోను కొనుగోలు చేయడం ద్వారా హోల్సేల్ వ్యాపారంలోకి ప్రవేశించారు. అంతకుముందు బ్రిటన్కు చెందిన ప్రముఖ బొమ్మల తయారీదారు హామ్లీస్నూ రిలయన్స్ టేకోవర్ చేసింది.
ఐపీఎల్లో ఎక్కువ ట్రోఫీలు గెలిచిన ముంబై ఇండియన్స్ కూడా ముకేశ్ అంబానీదే. దక్షిణాఫ్రికా, UAEలోనూ క్రికెట్ జట్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు యూరప్లోని ప్రముఖ ఫుట్బాల్ క్లబ్ను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. వ్యాపారంలో ముకేశ్ అంబానీ సామర్థ్యాన్ని గుర్తించిన ప్రపంచస్థాయి సంస్థలు వెదుక్కుంటూ వచ్చి మరీ పెట్టుబడులు పెడుతున్నాయి. జియో ప్లాట్ఫామ్స్లో మెటా, గూగుల్ కూడా పెట్టుబడులు పెట్టాయి. కేవలం వ్యాపారంలోనే కాదు.. సహాయకార్యక్రమాల్లోనూ ముకేశ్ ముందంజలో ఉన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ పేరుతో ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారు.