Technology:- ఆడ, మగ అన్న బేధాలు ఈరోజుల్లో ఎక్కడ ఉన్నాయిలే..? అని అనుకునేవారు చాలామంది ఉన్నారు. అది కొంతవరకు నిజమే. ఇంతకు ముందు తరాలతో పోలిస్తే.. ఆడవారు ప్రతీ రంగంలో మగవారికి పోటీ ఇస్తున్నారు అనే మాట కూడా చాలాసార్లు వినే ఉంటాము. కానీ ఇప్పటికీ కొన్ని రంగాలు ఆడవారిని మనస్ఫూర్తిగా దగ్గరకు తీసుకోవడం లేదు. వారికి అవకాశాలు దక్కనివ్వడం లేదు. ఈ గ్యాప్ను నింపడానికే టెక్నాలజీ పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో కూడా ఇంకా ఆడ, మగ బేధాలు ఉన్నాయని కొందరు నిపుణులు అంటుంటారు. అందుకే గత కొన్నేళ్లలో ఈ బేధాన్ని పోగొట్టి ఇద్దరికీ సమాన అవకాశాలను ఇవ్వడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ కష్టపడుతోంది. కొత్త ప్రయోగాలు చేసిన ఆడవారిని అభినందించడం మొదలుపెట్టింది. ప్రతీ ప్రతిష్టాత్మకమైన ప్రయోగంలో ఆడవారిని భాగం చేసింది. ఇలాగే ఎన్నో విధాలుగా లింగ బేధాన్ని పోగొట్టడానికి టెక్నాలజీ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
చదువు విషయంలో అందరూ సమానంగా ఉండాలని అనే ఆలోచన ఇన్నాళ్లకు నిజమయ్యింది. అయితే డిజిటల్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఆడ, మగ బేధాలు లేకుండా అందరూ సమానంగా చదువుకుంటే.. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో అందరికీ సమానంగా అవకాశాలు దొరుకుతాయి. టెక్నాలజీపై ఆడవారికి, మహిళలకు పూర్తిగా అవగాహన రావాలంటే సమాజం కూడా దీనిని బాధ్యతగా తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. వారి ఇంట్లోని ఆడవారిని టెక్నాలజీకి దగ్గర చేసే బాధ్యత వారిదే అని తెలిపారు.
ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ఇండస్ట్రీలో ఎక్కువగా మగవారే కనిపిస్తున్నారు. ఒక్క ఐటీలో తప్ప మిగతా టెక్నాలజీ ఇండస్ట్రీలు అన్నింటిలో మగవారి సంఖ్యే అధికంగా కనిపిస్తుంది. ఈ గ్యాప్ను తగ్గించాలంటే ఆడవారికి టెక్నికల్ అవగాహన ఎక్కువగా ఉండాలి. అది మాత్రమే ఇప్పుడు ఉన్న ఆడ, మగ బేధాన్ని పూర్తిగా తగ్గించగలదని నిపుణుల అభిప్రాయం. చిన్న వయసు నుండే ఆడపిల్లలకు డిజిటల్, టెక్నికల్ విద్యను నేర్పించడం వల్ల వారు కూడా టెక్నాలజీ రంగంలోని ఉద్యోగాల్లో సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
డిజిటల్ స్కిల్స్, కోడింగ్ అనేవి నేర్పించడం ద్వారా ఆడవారు కూడా టెక్నాలజీ రంగాల్లో స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో మహిళలు సేఫ్గా ఫీల్ అయినప్పుడే వారు ఉద్యోగాల కోసం ఇలాంటి రంగాలను ఎంపిక చేసుకుంటారు. ఇలా ఎన్నో అంశాల కారణంగా ఇప్పటికీ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఆడ, మగ బేధాలు ఉంటున్నాయని, ఈ సమస్యకు కూడా పరిష్కారం ఆడవారికి టెక్నాలజీపై పూర్తి అవగాహన ఏర్పడడమే అని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.