Tech Layoffs: టెక్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. గత రెండేళ్లలో రోజూ సుమారు 555 మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. భారత్ సహా విదేశాలలో ఉద్యోగులను కంపెనీలు ఇంటికి పంపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్టప్లతో సహా టెక్ కంపెనీలు గత రెండేళ్లలో 4 లక్షల కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాయి. అదే సమయంలో భారత్ 110 స్టార్టప్లు దాదాపు 30 వేల మందిని తొలగించాయి.
ప్రపంచ ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని బిగ్ టెక్ కంపెనీలు , అన్ని రంగాల స్టార్టప్లు ఉద్యోగులను తొలగించాయి. ఈ ప్రక్రియ కొనసాగుతోంది. తాజా డేటా ప్రకారం 2,120 టెక్ కంపెనీలు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 4,04,962 మంది ఉద్యోగులను తొలగించాయి.
గత రెండేళ్లలో రోజూ సుమారు 555 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రతి గంటకు 23 మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. జనవరిలోనే 89,554 మంది ఉద్యోగులను కంపెనీలు తొలగించాయి. ప్రస్తుతం సంఖ్య తగ్గినప్పటికీ ఉద్యోగాల తొలగింపులు మాత్రం కొనసాగుతున్నాయి. గత నెలలో 4,632 మంది ఉద్యోగులను కంపెనీలు తొలగించాయి.
ఈ సంవత్సరం అత్యధిక మంది ఉద్యోగులను తొలగించినవి రిటైల్ టెక్ , కన్సూమర్ టెక్. రిటైల్ టెక్ నుంచి 29,161మంది, కన్సూమర్ టెక్ నుంచి 28,873 మంది ఉద్యోగులను తొలగించారు. డిసెంబర్ లోపు మరిన్ని ఉద్యోగాల తొలగింపులు జరిగే అవకాశం ఉంది.
చిప్-మేకర్ క్వాలికామ్, USలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని తన రెండు కార్యాలయాలలో సుమారు 1,258 ఉద్యోగాలను తొలగించేందుకు ప్రణాళికలను సిద్దం చేసింది. USకి చెందిన ఇతర టెక్ సంస్థలు చైనాలసిస్,ప్లెక్స్, సిస్కో, పై ఇన్సూరెన్స్ ఇటీవల వందల మంది ఉద్యోగులను తొలగించాయి.