Drones Manufacture:మిలిటరీలో, డిఫెన్స్లో ఉపయోగపడడం కోసం ఇప్పటికే ఎంతోమంది పరిశోధకులు ఎన్నో విధాలుగా పనిచేసే టెక్నికల్ పరికరాలు తయారు చేసి వారికి అందించారు. డ్రోన్స్ లాంటివి ఇప్పటికే ఎన్నో దేశాల్లో డిఫెన్స్ కోసం ఉపయోగించబడుతున్నాయి. యుద్ధ సమయాల్లో వీటిని పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నారు. కానీ ఇంకా ఈ డ్రోన్స్ వినియోగాన్ని అలవాటు చేసుకోని దేశాలు కూడా ఉన్నాయి.
తైవాన్లోని చంగ్షాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్క్రూడ్ ఏరియల్ వెహికిల్స్ (యూఏవీ)లను తయారు చేయడానికి ఒక ప్రైవేట్ సంస్థతో చేతులు కలిపింది. వచ్చే ఏడాదిలోపు భారీ స్థాయిలో డ్రోన్లను మిలిటరీలో వినియోగించడమే యూనివర్సిటీ ముఖ్య లక్ష్యంగా పెట్టుకుంది. మిలిటరీలో అన్ని విధాలుగా ఉపయోగపడే కమర్షియల్ డ్రోన్లను వీరు తయారు చేయనున్నారు.
క్యారియర్ లాంచ్ డ్రోన్లు, నేలపై ఉండి నిఘా పెట్టే డ్రోన్లు, పూర్తిగా నిఘా కోసం ఉపయోగించే డ్రోన్లు, మినియేచర్ డ్రోన్లు, టార్గెట్ డ్రోన్లు.. ఇలా పూర్తిగా అయిదు రకాల డ్రోన్లను వారు తయారు చేయనున్నారు. మిలిటరీలో పనిచేయవలసిన డ్రోన్లను తయారు చేయాలంటే చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. ఇవి తయారు చేయడానికి కనీసం నాలుగు నుండి అయిదు సంవత్సరాలు సమయం కేటాయించవలసి ఉంటుంది. కానీ కమర్షియల్ డ్రోన్ల తయారీ మాత్రం ఒక ఏడాదిలోనే పూర్తవుతుంది కాబట్టి వీరు కమర్షియల్ డ్రోన్లు తయారు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
జులై 31లోపు శాంపిల్ డ్రోన్లను తయారు చేసి టెస్ట్కు పంపించాలని పరిశోధకులు టార్గెట్ పెట్టుకున్నారు. టెస్టింగ్ నుండి తయారీ వరకు పూర్తి బాధ్యత ఇన్స్టిట్యూట్దే అని వారు తెలిపారు. టెస్టులు పాస్ అయిన తర్వాత వచ్చే ఏడాదిలోపు మాస్ ప్రొడక్షన్ ప్రారంభించాలని వారు సన్నాహాలు చేస్తున్నారు. చైనా దేశంతో కలిసిందని అనుమానం వచ్చినా.. నేషనల్ సెక్యూరిటీ ఈ డ్రోన్లను మిలిటరీలోకి అనుమతించదని పరిశోధకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
డ్రోన్ల తయారీలో చైనా నుండి వచ్చే వస్తువులను కూడా ఉపయోగించవద్దని వారు నిర్ణయించుకున్నారు. వచ్చే ఏడాదిలోపు డ్రోన్లు మాత్రమే కాకుండా మిస్సైల్స్ తయారీ కూడా ప్రారంభించాలని తైవాన్ సన్నాహాలు చేస్తోంది. గతేడాది 800 మిస్సైల్స్ తయారు చేసిన తైవాన్.. ఈ ఏడాది కనీసం 1000 మిస్సైల్స్ తయారు చేయాలని అనుకుంటోంది. డ్రోన్లు, మిస్సైల్స్ తయారీతో తమ మిలిటరీకి మరింత బలాన్ని అందజేయాలని తైవాన్ ఆలోచిస్తోంది.