Social media:- ఈరోజుల్లో మాటలు రాని పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్స్ చేతికి ఇస్తే ఏడుపు ఆపేస్తున్నారు. అంతలాగా స్మార్ట్ ఫోన్స్ అనేవి వయసుతో సంబంధం లేకుండా అందరినీ ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా యువత అయితే ప్రస్తుతం ఉన్న ఈ స్మార్ట్ ఫోన్స్ ప్రపంచంలో మునిగి తేలుతున్నారు. టీనేజర్లకు స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడం అంత మంచిది కాదు.. అది వారిని చెడు వ్యసనాలకు అలవాటు చేస్తుందని నిపుణులు అంటుంటారు. కానీ అందులో ఒక మంచి కూడా ఉందని తాజాగా శాస్త్రవేత్తలు బయటపెట్టారు.
ఈరోజుల్లో సోషల్ మీడియా అనేది టీనేజర్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. లైక్స్ కోసం ఒక్కొక్కరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు చేయడానికి ఇష్టపడని వారు కూడా అందులో వచ్చే వార్తలను నమ్ముతారు. అయితే ఆ వార్తలు టీనేజర్ల మనస్తత్వాన్ని మార్చడానికి ప్రభావం చూపిస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతీ వార్తను గుడ్డిగా నమ్మేవారు ప్రశాంతంగా ఉంటారని, నమ్మని వారు ఎక్కువ మానసిక సంఘర్షణకు లోనవుతున్నారు.
కోవిడ్ 19 సమయంలో దానికి సంబంధించి ఎన్నో వార్తలు ఫేస్బుక్, ట్విటర్, టిక్టాక్ వంటి సోషల్ మీడియా యాప్స్లో వైరల్ అయ్యాయి. ఆ వార్తలను నమ్మిన వారు ఏం చేయాలో క్లారిటీగా ఉన్నారని, నమ్మని వారు ఎక్కువ ఒత్తిడికి లోనయ్యారని శాస్త్రవేత్తలు పరిశోధనల్లో తేలింది. అయితే అందులో వచ్చే అన్ని వార్తలు నిజం కాకపోవచ్చు, కొన్ని ఫేక్ న్యూస్లు కూడా ఉండవచ్చు.. అయినా కూడా దానిని నమ్మే టీనేజర్లు ఎక్కువ. అంతే కాకుండా అలా నమ్మినప్పుడే వారు ప్రశాంతంగా ఉంటారని శాస్త్రవేత్తలు గమనించారు.
సోషల్ మీడియా వినియోగం అనేది మనిషిపై పాజిటివ్ లేదా నెగిటివ్ ఎఫెక్ట్ చూపించదని, దానిని మనిషి చూసే కోణమే ఎఫెక్ట్ చూపిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా, అది టీనేజర్లపై చూపించే ప్రభావం గురించి ఎన్నో పరిశోధనలు జరిగాయి. ముఖ్యంగా కోవిడ్ సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలు టీనేజర్లపై చూపించిన ప్రభావాన్ని బట్టి శాస్త్రవేత్తల పరిశోధనల సులువుగా మారింది. ఫేక్ న్యూస్ అయినా కూడా టీనేజర్లు దానిని పూర్తిగా నమ్మినప్పుడు ఒత్తిడికి లోనవ్వడం లేదని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.