ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో.. చిన్న పొదుపు పథకాలకు కేంద్రం పెద్ద ప్రోత్సాహకాలు అందించే అవకాశం ఉందని వివిధ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ టర్మ్ లో మోడీ సర్కారుకు ఇదే ఆఖరి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో… ఆర్థిక లోటు పూడ్చుకునేందుకు, చిన్న పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా వివిధ పొదుపు పథకాలకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
2023లో ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు చిన్న పొదుపు పథకాల ద్వారా దాదాపు రూ. 5 లక్షల కోట్లు సమీకరించాలనేది కేంద్రం లక్ష్యం కావొచ్చని… సుకన్య సమృద్ధి యోజన వంటి చిన్న పొదుపు పథకం కోసం వచ్చే బడ్జెట్లో ప్రోత్సాహకాలు ప్రకటించవచ్చని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ తెలిపింది. అలాగే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వంటి వాటికి కూడా ఈ బడ్జెట్లో మంచి ప్రోత్సాహం లభించే అవకాశం ఉందని తెలిపింది.
సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని కేంద్రం 2015 సంవత్సరంలో ప్రారంభించింది. పదేళ్ల లోపు ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు ఈ పథకంలో చేరడానికి అర్హులు. ఈ పథకంలో రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. అలాగే ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80సీ ప్రకారం మొత్తం రూ. 1.5 లక్షల పెట్టుబడిపై పన్ను మినహాయింపు లభిస్తుంది. ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసులో సుకన్య సమృద్ధి ఖాతాను తెరవవచ్చు.
వృద్ధుల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన చిన్న మొత్తాల పొదుపు పథకమే… సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్. 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే ముందస్తు పదవీ విరమణ చేసి… 55 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న వారు కూడా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీంలో కూడా ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద… పెట్టుబడిపై రూ .1.50 లక్షల వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు. ప్రస్తుతం ఈ పథకానికి 7.6 శాతం వడ్డీ ఇస్తున్నారు. వచ్చే బడ్జెట్లో ఈ పథకానికి ఇంకా ప్రోత్సాహకం పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు.