Maharashtra: మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హ్యాండ్ గ్లవ్స్ కర్మాగారంలో చెలరేగిన మంటల్లో ఆరుగురు సజీవదహనమయ్యారు. ఔరంగాబాద్ సమీపంలో ఉన్న వలుజ్ ఛత్రపతి శంభాజీనగర్ లో ఈ విషాద ఘటన జరిగింది. ఆదివారం (డిసెంబర్31) తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో వలూజ్ ఎంఐడీసీ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగినట్లు తమకు సమాచారం వచ్చిందని ఒక అధికారి తెలిపారు.
అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేలోగానే కర్మాగారం మొత్తం అగ్నికి ఆహుతైనట్లు వెల్లడించారు. కర్మాగారంలో ఆరుగురు ఉన్నట్లు స్థానికులు చెప్పగా.. తమ సిబ్బంది లోపలికి వెళ్లి వారి మృతదేహాలను వెలికి తీశారని వివరించారు. కాగా.. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 10-15 మంది నిద్రిస్తున్నామని, కొందరం మాత్రం తప్పించుకోగలిగామని కార్మికులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవదహనం అవ్వడం విషాదం నింపింది. కాగా. అగ్నిప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.