Shikhamani:-కలియుగ వైకుంఠనాథుడైన శ్రీనివాసుడు ఎంతటి నైవేద్య ప్రియుడో అంతటి అలంకరణ ప్రియుడు, శ్రీవారి అలంకరణకు టీటీడీ అధిక ప్రాధ్యానం ఇస్తోంది. శ్రీనివాసునికి ప్రతిరోజూ రెండుసార్లు నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో తోమాలసేవలో స్వామి వారికి 300 కిలోల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేస్తారు.
శ్రీవారికి ప్రతినిత్యం సుగంధ పరిమళాలు వెదజల్లే చామంతి, లిల్లీ, మరువం, గన్నేరు వంటి 12 రకాల పుష్పాలతో మాలలను అలంకరిస్తారు. శ్రీవారి ఆలయంతో పాటు ఉపాలయాలైన బేడి ఆంజనేయస్వామి ఆలయం, వరదరాజ స్వామి ఆలయం, లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, వరాహస్వామి ఆలయాలకు కలిపి ప్రతిరోజూ 300 కిలోల పుష్పాలు అవసరమవుతాయి. తిరుమల కొండ మీద కేవలం ముప్పయి కిలోల పువ్వులే లభిస్తుంటే, మిగిలిన 270 కిలోల పుష్పాలను భక్తులు అందజేసే విరాళాలతో బయటి నుంచి తెప్పిస్తుంటారు.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవారికి పుష్పాలంకరణలో ముందుగా శిఖామణి అనబడే ఎనిమిది మూరల దండను స్వామివారి కిరీటం నుంచి రెండు భుజాల మీదుగా అలంకరిస్తారు. సాలగ్రామ మాలలను శ్రీవారి భుజాల నుంచి పాదాల వరకు రెండు వైపులా నాలుగు మూరలు ఉండే మాలలతో అలంకరిస్తారు. తరువాత మెడలో రెండు పొరలుగా రెండు భుజాల మీదకు అలంకరించే మూడున్నర మూరల పొడవుండే కంఠసరి మాలలను అలంకరిస్తారు. తర్వాత వక్షస్థల లక్ష్మీ మాలలను అలంకరిస్తారు.