Smart Insulin : ఒకప్పుడు ఫలానా ఆహారం తింటేనే ఇలాంటి సమస్య వస్తుంది, ఫలానా వయసు దాటిన వారికి మాత్రమే ఇలాంటి వ్యాధి సోకుతుంది.. అంటూ కొలమానం ఉండేది. కానీ ఈరోజుల్లో అలాంటి కొలమానం ఏమీ లేదు. స్కూలుకు వెళ్లే పిల్లలకు కూడా హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి. ఎక్కువగా తీపి తినకపోయినా.. జీన్స్ పరంగా డయాబెటీస్ సోకుతుంది. ముఖ్యంగా డయాబెటీస్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఇబ్బంది పెడుతోంది. అలా ఇబ్బంది పడుతున్న వారికోసమే శాస్త్రవేత్తలు ఒక స్మార్ట్ పరిష్కారాన్ని కనిపెట్టారు.
డయాబెటీస్ అనేది ప్రపంచంలోనే కామన్ వ్యాధిగా మారిపోయింది. వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొందరు అయితే ఇన్సులిన్ లేకుండా ఇంటి నుండి బయటికి కదలలేరు. ఎక్కడ ఉన్నా ఇన్సులిన్ వారిని తోడుగా ఉండాల్సిందే. అలాంటి వారికోసమే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భిలాల్ (ఐఐటీ) పరిశోధకులు.. శివ్ నాదర్ యూనివర్సిటీతో కలిసి స్మార్ట్ ఇన్సులిన్ను తయారు చేశారు. ఇది డయాబెటీస్ ట్రీట్మెంట్ విషయంలోనే పెద్ద సంచలనాన్ని సృష్టిస్తుందని వారు భావిస్తున్నారు.
వాతావరణానికి హాని చేయని బయో వనరులతో ఈ స్మార్ట్ ఇన్సులిన్ను తయారు చేసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది డయాబెటీస్ను మ్యానేజ్ విషయంలో సక్సెస్ సాధించిందని వారు బయటపెట్టారు. డయాబెటీస్తో బాధపడుతున్న వారి జీవిత క్వాలిటీని మెరుగుపరచడానికి ఇది కచ్చితంగా పనిచేస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం టైప్ 1, అడ్వాన్స్ టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారు వారి బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ను అదుపులో ఉంచుకోవడం కోసం పూర్తిగా ఇన్సులిన్పైనే ఆధారపడుతున్నారు. అయితే ఈ ఇన్సులిన్ ప్రక్రియ అనేది చాలా నొప్పితో కూడుకున్నది మాత్రమే కాకుండా హైపోగ్లేమియా అనే కండీషన్కు కూడా దారితీసే అవకాశం ఉంటుంది.
మామూలుగా రెగ్యులర్ ఇన్సులిన్ అనేది కేవలం 12 గంటలు మాత్రమే పనిచేస్తుంది. కానీ శాస్త్రవేత్తలు తాజాగా తయారు చేసిన స్మార్ట్ ఇన్సులిన్ మాత్రం దాదాపు రెండు రోజుల వరకు పనిచేస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే ఈ స్మార్ట్ ఇన్సులిన్ను డయాబెటీస్ ఉన్న ఎలుకలపై ప్రయోగించి చూడగా.. ఆ ప్రయోగాలు సక్సెస్ అయ్యాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తరవాత హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభించి.. త్వరలోనే ఈ స్మార్ట్ ఇన్సులిన్ను డయాబెటీస్ ఉన్నవారికోసం మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇస్తున్నారు.