ఆదిమానవులు ఎలా ఉండేవారు, వారు అసలు ఎలాంటి జీవనం కొనసాగించేవారు.. అనేదానిపై శాస్త్రవేత్తల పరిశోధనలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. వారు ఆనవాళ్లు గుర్తించేలా ఆర్కియాలజిస్ట్స్ చేతికి ఏదో ఒక క్లూ చిక్కుతూనే ఉంది. తాజాగా ఆదిమానవులు ఉపయోగించిన రాళ్లను వారు గుర్తించారు. ఇవి దాదాపు 2.9 మిలియన్ ఏళ్ల క్రితం రాళ్లగా భావిస్తున్నారు.
అప్పట్లో ఆదిమానవులు రాళ్లతోనే అన్ని పనులు చేసేవారని హిస్టరీ పుస్తకాలు చెప్తున్నాయి. శాస్త్రవేత్తలు కూడా అదే నిజమని నిర్ధారించారు. వారు హిప్పోలను చంపి తినడానికి కూడా వాళ్లు ఒక రకమైన రాళ్లనే ఉపయోగించేవారని శాస్త్రవేత్తలు అంటున్నారు. వాటినే ఓల్డోవాన్ టూల్కిట్ అని పిలుస్తారని వారు చెప్తున్నారు. ఎన్నో పనులకు ఈ రాళ్లను ఉపయోగించినా.. ముఖ్యంగా పెద్ద జంతువులను చంపి తినడానికి వీటిని ఎక్కువగా ఉపయోగించేవారని తెలుస్తోంది.
ఆఫ్రికాలోని లేక్ విక్టోరియా తీరంలో శాస్త్రవేత్తలకు ఆదిమానవులు ఉపయోగించిన రాళ్లు కనిపించాయి. ఇవి దాదాపు 2.9 మిలియన్ ఏళ్ల క్రితం రాళ్లగా వారు గుర్తించారు. కెన్యాలోని పెనిన్సులా నదీ తీరాన కూడా మరికొన్ని విచిత్రమైన రాళ్లను వారు గమనించారు. ఇవి కచ్చితంగా ఆదిమానవుల కాలానికి చెందినవాటిగా వారు బలంగా నమ్ముతున్నారు. అయితే అవే ప్రాంతాల్లో ఆదిమానవులు జీవించారు అని నిర్ధారించడానికి వారికి మరికొన్ని ఆనవాళ్లు కావాలి కాబట్టి వాటికోసమే శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఈ రాళ్లను గుర్తించడం ద్వారా ఆదిమానవులకు, ప్రస్తుత మానవాళికి దూరం తగ్గిపోయిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. వీటిని మరింత క్షుణ్ణంగా పరీక్షించడం వల్ల అప్పటివారి సామర్థ్యం గురించి, జీవనశైలి గురించి మరిన్ని ఆధారాలు దొరికే అవకాశాలు ఉన్నాయని వారు అన్నారు. రాళ్లను గుర్తించిన ప్రాంతంలోనే వారికి ఒక పన్ను దొరికిందని బయటపెట్టారు. దీనిపై క్షుణ్ణంగా పరీక్షలు జరగనున్నాయని వారు తెలిపారు. ఈ రాళ్లను, పన్నును పరీక్షించడం వల్ల ఆదిమానవుల గురించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.