ప్రస్తుతం ప్రపంచ పరిశోధకుల దృష్టంతా చిన్నప్పటి నుండి పిల్లల్లో సైన్స్ అండ్ టెక్నాలజీపై ఆసక్తి కలిగించడంపైనే ఉంటుంది. వారిలో ఆసక్తి పెంచడానికి ఇప్పటికే పరిశోధకులు ఎన్నో మార్గాలను కనుగొన్నారు. వీటి వల్ల పిల్లలకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆసక్తి కలగడమే కాకుండా వారు ఈ ఫీల్డ్ను సీరియస్గా తీసుకోవడం కూడా మొదలుపెడతారని పరిశోధకులు ఆశిస్తున్నారు. అందుకే తాజాగా వారు మరో కొత్త ప్లాన్తో ముందుకొచ్చారు.
చాలావరకు చిన్నపిల్లలు వివిధ రకాల గేమ్స్ను చాలా ఇష్టంగా ఆడుతారు. అందులోనూ వీడియో గేమ్స్ అంటే వారికి ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. అందుకే సైన్స్ను కూడా గేమ్స్ పద్ధతిలో వారికి అందించాలని చైనా శాస్త్రవేత్తలు నిర్ణయించారు. అందుకే షాంఘై సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియంలో సైన్స్ను గేమ్స్ ద్వారా నేర్చుకునే ఏర్పాటును చేశారు. ఇది సైన్స్ను వారికి మరింత దగ్గర చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
సైన్స్ గేమ్స్ అనేవి మ్యూజియంలో సైన్స్ను ప్రమోట్ చేయడంతో పాటు దాని పట్ల పిల్లల్లో ఆసక్తిని కూడా పెంచుతుందని చైనా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మ్యూజియంలలో సైన్స్ గేమ్స్ను ఏర్పాటు చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇప్పటికే అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీలో ఓలోజీ అనే ఆన్లైన్ ప్లాట్ఫార్మ్ను ఏర్పాటు చేసి అందులో 66 సైన్స్ గేమ్స్ను ప్రారంభించారు. దీనికి పిల్లల దగ్గర నుండి అశేష స్పందన వచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు. అదే ఫార్ములాను ఇప్పుడు చైనా కూడా ఉపయోగించనుంది.
న్యూయార్క్ హాల్ ఆఫ్ సైన్స్ కూడా ఇంతకు ముందు ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించింది. పబ్లిక్ స్కూల్స్లో కంప్యూటర్లకు సంబంధించి, సైన్స్కు సంబంధించి విద్యార్థులకు తగిన ట్రైనింగ్ ఇవ్వాలని యాజమాన్యాలకు 3.6 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందజేసింది. ఇప్పుడు ఇదే ట్రెండ్ షాంఘై మ్యూజియం ఫాలో అవుతోంది. 2021లో చైనాలో మొదటిసారిగా సైన్స్ గేమ్ కాన్ఫరెన్స్ను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు చైనా.. 58 సైన్స్ గేమ్స్ను డెవలప్ చేసి విద్యార్థులకు అందించింది.