Zoom : వీడియో కమ్యూనికేషన్ టెక్నాలజీ సంస్థ జూమ్ ఉద్యోగులను తగ్గించుకునే పని చేపట్టింది. ఏకంగా కంపెనీ ప్రెసిడెంట్ గ్రెగ్ టూంబ్ ను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ విషయాన్ని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ లో పేర్కొంది. 2022 జూన్లో కంపెనీ ప్రెసిడెంట్ గా గ్రెగ్ ను ప్రమోట్ చేసింది. ఏడాది కాకుండానే ఆయనను తొలగించి షాక్ ఇచ్చింది. జూమ్ కొత్త ప్రెసిడెంట్ గా ఎవరిని నియమిస్తారనే ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతానికి కొత్త బాస్ ను నియమించే యోచన లేదని తెలుస్తోంది.
2019లో జూమ్లో చీఫ్ రెవెన్యూ ఆఫీసర్గా గ్రెగ్ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ప్రమోషన్పై ప్రెసిడెంట్ అయ్యారు. జూమ్ లో చేరక ముందు గ్రెగ్ గూగుల్లో విక్రయాలు, వర్క్స్పేస్, సెక్యూరిటీ, జియో ఎంటర్ప్రైజ్ విభాగాలకు వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు.
మరోవైపు జూమ్ ఫిబ్రవరిలో భారీగా ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. మొత్తం 1,300 మందికి ఉద్వాసన పలికింది. అంటే కంపెనీలో దాదాపు 15 శాతం ఉద్యోగులను తొలగించింది. అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్న తమ సిబ్బందికి చట్ట ప్రకారం 16 వారాల వేతనం, హెల్త్కేర్ కవరేజీ, 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బోనస్, 6నెలలపాటు స్టాక్ ఆప్షన్పై అధికారం ఇచ్చింది. అమెరికాయేతర దేశాల్లోని తమ ఉద్యోగుల కోసం ఆగస్టు 9 వరకు సమయం ఇచ్చింది.
వ్యాపారాల్లో ఇబ్బందికర పరిస్థితులను తొలగించడానికి జూమ్ను ఏర్పాటు చేశామని కంపెనీ పేర్కొంది. కొవిడ్ సమయంలో కంపెనీ దశ మారిందని తెలిపింది. దీంతో ప్రజల మధ్య కనెక్టివిటీని పెంచడానికి వేగవంతంగా నియామకాలు చేపట్టామని వివరించింది. 24 నెలల్లో సంస్థ 3 రెట్ల వృద్ధిని సాధించిందని వెల్లడించింది. మరోవైపు నిర్వహణ ఖర్చులను తగ్గించుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తన వార్షిక వేతనంలో 98 శాతం కోత విధించుకున్నట్లు కంపెనీ సీఈవో ఎరిక్ యువాన్ ప్రకటించారు. ఎగ్జిక్యూటీవ్ బోనస్ను వదులుకున్నానని తెలిపారు.