RBI : రూ. 2 వేల నోట్ల మార్పిడిపై బ్యాంకు ఖాతాదారుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా రూ.50,000 కంటే ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లకు పాన్ సమర్పించాలనే నిబంధన ఎప్పటి నుంచో ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గుర్తు చేశారు. అదే నిబంధన రూ.2 వేల నోట్ల డిపాజిట్లకూ వర్తిస్తుందన్నారు.
నగదు నిర్వహణలో భాగంగానే రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నామని శక్తికాంత్ దాస్ వెల్లడించారు. 2016లో నోట్ల రద్దు తర్వాత వ్యవస్థలోకి వేగంగా నగదును చొప్పించడానికే రూ.2 వేల నోటును తీసుకొచ్చినట్లు వివరించారు. నోట్ల మార్పిడికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేశామని వివరించారు.
సెప్టెంబర్ 30 నాటికి చాలా వరకు రూ.2 వేల నోట్లు ఖజానాకు చేరతాయని తాము ఆశిస్తున్నామని శక్తికాంత్ దాస్ తెలిపారు. నోట్ల మార్పిడి సమయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆర్బీఐ చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. కొందరు వ్యాపారులు కొంత కాలం నుంచే రూ.2 వేల నోట్లను స్వీకరించడంలేదన్నారు. ఉపసంహరణ ప్రకటన తర్వాత అది మరింత ఎక్కువై ఉంటుందని అభిప్రాయపడ్డారు.