Prisoners in Automobile Sector : ఉక్రెయిన్, రష్యా వార్ అనేది కేవలం ఆ దేశాల మధ్యే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభావం చూపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఆర్థికంగా ఈ రెండు దేశాలు చాలా ఎదురుదెబ్బ తిన్నాయి. ఇప్పటికీ ఈ వార్ ఎఫెక్ట్ నుండి కోలుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉక్రెయిన్పై రష్యా పైచేయి సాధించింది కానీ కొన్ని రంగాల్లో మామూలు స్థితికి రావడానికి మాత్రం కష్టపడుతూనే ఉంది. అందులో ఒకటి ఆటోమొబైల్.
ఈ వార్ వల్ల యూరోపియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది పూర్తిగా కుప్పకూలిపోయింది. ఇప్పటికే ఎన్నో కంపెనీలు రష్యాను విడిచి వెళ్లిపోయాయి. ఉన్న కంపెనీలు కూడా తమ కార్యకలాపాలను జరపడం కోసం కష్టపడుతున్నాయి. రష్యా ఆటోమొబైల్ మార్కెట్లో రెనోల్ట్ గ్రూప్ కీలక పాత్రను పోషిస్తుంది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్తో రష్యా వార్ మొదలైన తర్వాత మెల్లగా అక్కడ ప్రొడక్షన్ను తగ్గించేసిన రెనాల్ట్.. చివరికి తన ఆపరేషన్స్ను పూర్తిగా విరమించుకుంది.
ప్రొడక్షన్ ఆపేసే సమయానికి రెనాల్ట్కు ఆటోవాజ్ అనే సంస్థలో 67.69 శాతం ఓనర్షిప్ ఉంది. అందులో నుండి తప్పుకోవడం కోసం రెనాల్ట్ భారీ మొత్తాన్నే ఖర్చు పెట్టింది. ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో వెహికిల్స్ ప్రొడక్షన్ బాధ్యత ఎక్కువగా ఆటోవాజ్పైనే పడింది. దీంతో కస్టమర్లను తృప్తిపరిచే విధంగా ప్రొడక్షన్ జరగడం లేదు. గతేడాది ఈ వాహనాలు కొన్నవారందరూ ఎన్నో కంప్లెయింట్స్తో ముందుకొచ్చారు. కార్లలో ఏసీ బాలేదని, ఎయిర్బాగ్స్ లాంటివి బాలేదని ఇలా ఎన్నో నెగిటివ్ రివ్యూలను ఇచ్చారు.
ప్రస్తుతం ఆటోవాజ్.. ఎన్నో విషయాల్లో వెనకబడి ఉంది. ఉద్యోగులు కూడా తక్కువమంది ఉండడంతో ఇబ్బందులు మరీ ఎక్కువయిపోతున్నాయి. అందుకే ఉద్యోగుల కోసం ఆటోవాజ్ వేట మొదలుపెట్టింది. అందుకే రష్యన్ ప్రిజన్ సర్వీస్ (ఎఫ్ఎస్ఐఎన్)తో మీటింగ్ను ఏర్పాటు చేసుకుంది. ఆటోవాజ్ అనుకున్నట్టుగా సెప్టెంబర్ వరకు 28 శాతం, వచ్చే జనవరి వరకు 40 శాతం ప్రొడక్షన్ మెరుగుపడాలంటే ఉద్యోగులు కావాలని చర్చలు జరిపింది.
ఒకప్పుడు రష్యాలోని జైళ్లలో ఉండే ఖైదీలను వేర్వేరు రంగాల్లో పనిచేయడానికి ఉద్యోగుల్లాగా పంపించేవారు. కానీ ఆ పద్ధతికి ఫుల్స్టాప్ పడి చాలాకాలమే అయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు ఆటోవాజ్.. మళ్లీ ఇలాంటి పద్ధతిని ప్రారంభించనుంది. ప్రస్తుతం రష్యాలోని జైళ్లలో దాదాపు 3 లక్షల మంది ఖైదీలు ఉన్నారు. అందులో కనీసం 100 మంది అయినా తమకు కావాలని ఆటోవాజ్ చర్చించింది. మెల్లగా ఈ నెంబర్ను పెంచుకుంటూ వెళ్లాలని ఆటోవాజ్ ప్లాన్ చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.