Tech Industry : ఇండియాలోని టెక్ రంగం అనేది ఇతర అభివృద్ధి చెందిన దేశాలలోని టెక్ సంస్థలతో పోటీపడుతోంది. ముఖ్యంగా ఇక్కడి ఇంజనీర్లు వెళ్లి ఇతర దేశాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేసే స్థాయికి ఎదిగింది. అందుకే ఐటీ తరపునుండి ఇండియాకు మరింత బలం చేకూరనుందని నిపుణులు చెప్తున్నారు. అంతే కాకుండా ఈ రంగంలో అభివృద్ధి మరింత పెరగనుందని కూడా అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ గణాంకలపై వారు ఒక వివరణ ఇచ్చారు.
కోవిడ్ అనే మహమ్మారి చాలా రంగాల రూపురేఖలను మార్చేసింది. అభివృద్ధి చెందిన రంగాలు, లాభాల్లో ఉన్న సంస్థలను కూడా ఒక్కసారిగా నష్టాల్లోకి తోసాయి. ఐటీకి కూడా ఏమీ మినహాయింపు దక్కలేదు. కానీ ఇప్పుడిప్పుడే ఐటీ మళ్లీ ప్రీ ప్యాండమిక్ కలను సంతరించుకుంటుందని నిపుణులు అంటున్నారు. ఈ ఏడాదిలో ఐటీ దాదాపు 9.6 శాతం ఎదుగుదలను చూడనుందని వారు తెలిపారు. 2023లో ఇప్పటివరకు ఐటీ రంగం మెరుగుపడిందని, ఇక 2024లో ఇది మరింత మెరుగుపడనుందని వారి రిపోర్టులో తేలింది.
2023లో ఎకానమీ 0.8 శాతం పెరగనుందని ఒక ప్రైవేట్ సంస్థ చేసిన సర్వేలో తేలింది. ఒకవైపు ఎదుగుదల చూపిస్తూనే.. మరోవైపు కొన్ని విషయాల్లో వెనకబడుతోంది కూడా. రూపాయి విలువ రోజురోజుకీ తగ్గిపోతోంది. ఎక్కడో జరిగే ఉక్రెయిన్ వార్ ఇండియన్ ఎకానమీపై ప్రభావం చూపిస్తోంది. అయినా కూడా టెక్ రంగం, హార్డ్వేర్ సెక్టార్ ఎదుగుదలను చూపించనున్నాయని రిపోర్టు చెప్తోంది. ఒకప్పటితో పోలిస్తే ఐటీ కంపెనీల్లో కూడా మార్పులు వచ్చాయి. దాదాపు అన్ని ఐటీ సంస్థలు ప్రాజెక్ట్స్తో ముందుకెళ్తున్నాయి. ఇది కూడా అభివృద్ధికి ఒక కారణమని తెలుస్తోంది.
ఏ టెక్నాలజీ కావాలన్నా ఇతర దేశాలపై ఆధారపడే రోజులు పోయాయి. ఒకవేళ కొత్త టెక్నాలజీ కావాలన్నా కూడా సొంతంగా తయారు చేసే స్థాయికి ఇండియన్ టెక్ కంపెనీలు, నిపుణులు ఎదిగారు. అన్నింటికంటే ముఖ్యంగా టెలికాం రంగం అనేది ఎక్కువ పెట్టుబడులను చూస్తుందని రిపోర్ట్ చెప్తోంది. గతేడాదిలో జరిగిన 5జీ సేవలు, వెబ్ 3, మెటావర్స్, ఏఐ లాంటి టెక్నికల్ మార్పులు.. టెలికమ్యూనికేషన్స్ రంగానికి కొత్త ఊపునిచ్చాయి.