Pooja Mandir for Home: ఇంటిలో పూజామందిరానికి వాస్తు పరంగా చాలా ప్రాధాన్యం ఉంది. పూజామందిరం ఎక్కడ ఉండాలి? ఏ దిశగా అమర్చుకోవాలి? ఎక్కడ పెడితే ఎలాంటి ఫలితాలుంటాయనే అంశాలను వాస్తు శాస్త్రం వివరిస్తోంది. అయితే.. ఒక్కో ఇల్లు ఒక్కోలా ఉంటుంది కనుక ఆ ఇంటి పరిస్థితిని బట్టి ఒక్కొక్కరు ఒక్కోచోట ఈ మందిరాలను పెట్టుకోవాల్సి ఉంటుంది కనుక దానిపై వాస్తు శాస్త్రం చెబుతున్న సూచనలేమిటో తెలుసుకుందాం.
ఈశాన్య మూలను ఈశ్వర స్థానంగా, పూజా మందిరం పెట్టేందుకు అది ఉత్తమ స్థానంగా వాస్తుశాస్త్రం చెబుతోంది. సూర్యుడు ఉదయించే తూర్పు, ఇంద్రుని నివాసమైన ఉత్తరాలు కలిసే ఈశాన్యం దిశగా కూర్చుని ప్రార్థించటం వల్ల అదృష్టం, జీవితంలో పురోగతి కలుగుతుంది. ఈశాన్యం కుదరని పక్షంలో పూజామందిరాన్ని గదిలో తూర్పు భాగంలో (మందిరం ముఖం పడమర వైపు ఉండేలా) అమర్చుకోవచ్చు. దీనివల్ల ఆ ఇంటికి ధనాకర్షణ పెరుగుతుంది. అదీ కుదరని పక్షంలో మందిరాన్ని దక్షిణ ముఖంగా పెట్టి, యజమాని ఉత్తరం వైపు చూసేలా కూర్చుని ప్రార్థించటం వల్ల ఇంటిలో వ్యక్తుల మధ్య అపోహలు కలతలు పోయి.. సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
అయితే.. పూజామందిరాన్ని ఉత్తరముఖంగా అమర్చి, యజమాని దక్షిణాన్ని చూస్తూ కూర్చుని పూజ చేయటాన్ని వాస్తు శాస్త్రం నిషేధించింది. ఇక.. పూజ గదిలో లేదా కలపతో చేసిన మందిరంలో దేవుని విగ్రహాల విషయంలోనూ వాస్తు కొన్ని సూచనలు చేస్తోంది. విగ్రహాలను నేలపై ఉంచరాదు. వాటిని ఏదైనా పీటమీద లేదా కనీసం వస్త్రం లేదా తమలపాకు మీదైనా ఉంచాలి. విగ్రహాల సైజు ఏడు అంగుళాలకు మించరాదు. లోపల ఖాళీగా ఉన్న పోత పోసిన విగ్రహాలు పూజకు పనికి రావు. మట్టి, వెండి, రాగి, ఇత్తడి విగ్రహాలు పెట్టుకోవచ్చు. పూజాసమయంలో విగ్రహాల ముఖాన్ని పూలమాలలతో కప్పకూడదు. రాక్షస సంహారం చేస్తున్న భంగిమలోని దేవీదేవతా విగ్రహాలు, పటాలు వద్దు. పూజా మందిరం లేదా పూజా స్థానం మెట్ల కింద గానీ, ప్రధాన ద్వారం ముందుగానీ ఉండకూడదు. అలాగే.. బేస్మెంట్లో, టాయిలెట్ను ఆనుకున్న ఆవలి గది గోడను తాకుతూ ఉంచొద్దు.పూజామందిరంలో ఫోటోలు, విగ్రహాలు పెట్టేముందు.. ఎర్రని వస్త్రాన్ని పరచటం మంచిది. పూజామందిరంలో ఎడమవైపు గంటను పెట్టాలి.