Pollution lead to Dementia : కాలుష్యం అనేది మనుషులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అని శాస్త్రవేత్తలు ఇదివరకే చాలాసార్లు వెల్లడించారు. అందుకే పెరుగుతున్న కాలుష్యం వల్ల మానవాళికి సమస్యలు రాకుండా వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలు అనేవి కాలుష్యాన్ని అదుపు చేయలేకపోతున్నాయి. అందుకే కాలుష్యం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలకు కూడా సిద్ధంగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు. తాజాగా గాలి కాలుష్యం అనేది మానసిక సమస్యకు దారితీస్తుందని బయటపెట్టారు.
గాలి కాలుష్యం అనేది మనుషులు పీల్చుకునే గాలి క్వాలిటీ పూర్తిగా తగ్గించేసింది. దీంతో పాటు ఎన్నో హానికరమైన గ్యాసులను మనుషుల శరీరంలోకి ప్రవేశించేలా చేస్తున్నాయి. దీంతో మనకు తెలియకుండానే మనం ఎన్నో హానికరమైన ఆరోగ్య సమస్యలలో చిక్కకుంటున్నాం. తాజాగా గాలి కాలుష్యం వల్ల, కాలుష్య కారకాల వల్ల మనుషులకు డిమెన్షియా వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. డిమెన్షియా అనేది శాస్త్రవేత్తలకు, వైద్యులకు అంతుచిక్కని మానసిక సమస్యలలో ఒకటి. ఇప్పుడు దీనికి కారణమయ్యే కారకాన్ని కనిపెట్టడం శాస్త్రవేత్తలు ఒక పెద్ద అడుగుగా భావిస్తున్నారు.
డిమెన్షియాను మరింతగా స్టడీ చేయడానికి ఈ పరిశోధన అనేది ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. సహజంగా డిమెన్షియా సోకిన వారిని కాకుండా ఇతర కారణాల వల్ల ఈ వ్యాధికి గురయ్యారు అని అనుమానించే వారిపై వారి పరిశోధనల చేశారు. ఇందులో వారి వ్యాధికి కారణమయ్యే వాటిలో గాలి కాలుష్యం పాత్ర కూడా ఉందని కనిపెట్టారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 57 మిలియన్ ప్రజలు డిమెన్షియాతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి గురించి కనుక్కుంటే వీరందరికి కొంతమేరకు చికిత్స అందించే అవకాశం ఉంటుందని వారు ఆశిస్తున్నారు.
2050 వరకు ప్రపంచవ్యాప్తంగా డిమెన్షియాతో బాధపడుతున్న వారి సంఖ్య 153 మిలియన్కు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో 40 శాతం వరకు కేసులు గాలి కాలుష్యం వల్ల డిమెన్షియా సోకినవారే అయ్యింటారని వారు భావిస్తున్నారు. అందుకే ఇప్పటికే గాలి కాలుష్యం వల్ల మనుషులు ఎన్నో సమస్యలు ఎదుర్కుంటుండగా.. ఇలాంటి ఒక మానసిక సమస్యకు కూడా అది కారణమవుతుందని తెలిసినప్పుడు వారు మరింత జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా కాలుష్యం తగ్గడానికి తమవంతు ప్రయత్నం చేయాలని చెప్తున్నారు.