E-gold investment : బంగారం కొంటున్నా ఎక్కడో భయం ఉంటుంది. సేఫ్టీ విషయంలో చాలా మందికి కంగారు. అలాగని బంగారంలో పెట్టుబడి పెట్టకుండా ఉండలేరు. అలాంటి వారికి ఈ-గోల్డ్ బెస్ట్ ఆప్షన్. ఫిజికల్గా బంగారం కొనే బదులు ఈ-గోల్డ్ రూపంలో, గోల్డ్ బాండ్స్లో పెడితే మంచి బెనిఫిట్స్ ఉంటాయి.
పైగా ఇలా బంగారం కొన్న వారికి కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా ఇస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో బెనిఫిట్ కూడా ఆఫర్ చేస్తోంది కేంద్రం. ఫిజికల్ గోల్డ్ను ఈ-గోల్డ్గా మార్చేస్తే క్యాపిటల్ ప్రాఫిట్ ట్యాక్స్ ఉండదని చెప్పింది. మరి ఫిజికల్ గోల్డ్ను ఈ-గోల్డ్గా మార్చుకోవడం ఎలా. ఎలా చేయాలి, దానికి ఏమేం కావాలి.
ఫిజికల్ గోల్డ్ను ఈ-గోల్డ్గా మార్చాలనుకుంటే ముందుగా డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. ఈ అకౌంట్ ఓపెన్ చేశాక.. సెబీ పర్మిషన్ ఉన్న డెలివరీ సెంటర్కు వెళ్లి వాల్ట్ మేనేజర్ దగ్గర బంగారాన్ని డిపాజిట్ చేయాలి. వాల్ట్ మేనేజర్ ఆ బంగారం ప్యూరిటీ ఎంతో చూసి.. దాని విలువ లెక్కిస్తారు.
మీ బంగారం విలువ ఎంతో.. అంతే సమానంగా దాన్ని ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్ (ఈజీఆర్) గా మారుస్తారు. ఈ సమాచారాన్ని స్టాక్ ఎక్సేంజెస్, డిపాజిటరీ సంస్థలు, ఇతర వాల్ట్ మేనేజర్స్, సీసీఐఎల్కు అందుబాటులో ఉండే మ్యూచువల్ ప్లాట్ఫామ్పై షేర్ చేస్తారు. ఆ తరువాత నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ జారీ చేసిన ఇంటర్నేషనల్ సేఫ్టీ ఐడీ కార్డ్ నంబర్ను ఈజీఆర్కు కేటాయిస్తారు. అప్పుడు దానిపై స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ చేయడానికి వీలుంటుంది. మీకు కావాల్సినప్పుడు ఈ ఈ-గోల్డ్ను ఫిజికల్ గోల్డ్ గానూ మార్చుకోవచ్చు. అంతేకాదు, ఫిజికల్ గోల్డ్ను డెలివరీ ఫీ చెల్లించి, నేరుగా ఇంటికే తెప్పించుకోవచ్చు.