Paytm :పేటీఎం కరో.. ఇదీ ఆ సంస్ధ యాడ్ లో కమ్మగా వినిపించే మాట. కానీ ఇప్పుడు పేటీఎం అంటే చాలు… అందులో పెట్టుబడి పెట్టిన వాళ్లు కుయ్యో మొర్రో అంటున్నారు. ఎందుకంటే… ఐపీవో ఆఫర్ ధరతో పోలిస్తే పేటీఎం విలువ ఏకంగా 78 శాతం పతనమై… రూ.లక్ష కోట్లకు పైగా కరిగిపోవడంతో… పెట్టుబడి పెట్టినవాళ్లు ఏం చేయాలో అర్థంకాక జుట్టు పీక్కుంటున్నారు. ఓ వైపు ప్రతీ త్రైమాసికంలోనూ నష్టం, మరోవైపు ప్రీ-ఐపీవో ఇన్వెస్టర్లు ఏడాది లాకిన్ పీరియడ్ తర్వాత షేర్లు తెగనమ్మడం… ఇంకోవైపు ఫిన్ టెక్ రంగంలో పెరుగుతున్న పోటీ… పేటీఎం పతనాన్ని మరింత శాసిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
పేటీఎం ఐపీవో ఆఫర్ ధర రూ.2,150. విలువ పరంగా చరిత్రలో పేటీఎందే అతిపెద్ద ఐపీవో అని ఓ రేంజ్ లో ప్రచారం జరగడంతో… చిన్న ఇన్వెస్టర్లు ఆశకొద్దీ పేటీఎం షేర్లు కొన్నారు. అయితే ఐపీవో ఫ్లాట్ గా ముగియడంతో… లిస్టింగ్ రోజునే ఇన్వెస్టర్లకు చుక్కలు కనిపించాయి. ఆఫర్ ధరతో పోలిస్తే 9 శాతం డిస్కౌంట్ తో రూ.1,950 దగ్గర లిస్టైన పేటీఎం షేరు ధర… తొలి రోజే 27 శాతం నష్టంతో రూ.1,564 వద్ద ముగిసింది. ఏడాది కిందట మొదలైన పేటీఎం పతనం… ఎప్పటికప్పుడు కొత్త గరిష్టాలకు చేరుతూనే ఉంది. తాజాగా పేటీఎం షేరు ధర రూ.474కు దిగజారింది. ఇది ఆల్ టైమ్ కనిష్ట ధర. గత వారం పేటీఎం ప్రారంభ ఇన్వెస్టర్ అయిన సాఫ్ట్ బ్యాంక్… 4.5 శాతం వాటాను రూ.555-రూ.601 మధ్య తెగనమ్మి… నష్టాలే మూటగట్టుకుంది. ఆ రోజు పది శాతానికి పైగా కుంగిన పేటీఎం షేరు ధర… తాజాగా మరో 11 శాతం కుంగింది.
పేటీఎం, ఫోన్ పే వంటి ఫిన్ టెక్ సేవల రంగంలోకి జియో ఫైనాన్షియల్ సర్వీసుల ప్రవేశంతో పోటీ మరింత తీవ్రం అవుతుందనే విశ్లేషణలు వెలువడటంతో… ఒక్కసారిగా పేటీఎం షేరు పతనమైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలోని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ దేశంలో ఐదో అతిపెద్ద ఆర్థిక సేవల సంస్థగా అవతరించవచ్చని… దాని ప్రభావం పేటీఎం, ఫోన్ పే వంటి సంస్థల ఆదాయంపై తీవ్రంగా పడొచ్చనే అంచనాలు… పేటీఎం తాజా పతనానికి కారణమని చెబుతున్నారు. దాంతో… పేటీఎం పతనం ఇక్కడితో ఆగదని… ఇంకా కొనసాగుతుందని మార్కెట్ అనలిస్టులు చెబుతున్నారు.