Paytm collapses : పేటీఎం షేర్లు కొన్న చిన్న ఇన్వెస్టర్లకు మరోసారి షాక్ తగిలింది. వన్ 97 కమ్యూనికేషన్స్లో తన వాటాను చైనాకు చెందిన అలీబాబా కంపెనీ పూర్తిగా అమ్మేయడంతో… పేటీఎం షేర్లు మళ్లీ భారీగా నష్టపోయాయి. ఇంట్రాడేలో దాదాపు 10 శాతం వరకూ నష్టపోయిన పేటీఎం షేరు ధర… చివరికి సుమారు 8 శాతం నష్టంతో రూ.650 దగ్గర ముగిసింది. ఈ పరిణామంతో కంపెనీ భవిష్యత్తు ఎలా ఉంటుందోననే ఆందోళనలో ఉన్నారు… ఇన్వెస్టర్లు.
చైనాకు చెందిన ఏఎన్టీ ఫైనాన్షియల్ ఆధ్వర్యంలో నడిచే అలీబాబా కంపెనీకి… పేటీఎమ్లో 25 శాతం వాటా ఉండేది. స్టాక్ మార్కెట్లో పేటీఎం లిస్ట్ అయ్యి, ఏడాది లాకిన్ పీరియడ్ ముగిశాక కొద్దికొద్దిగా తన వాటా అమ్ముకుంటూ వస్తున్న అలీబాబా… గత జనవరిలోనూ 3.1 శాతం వాటాను విక్రయించింది. దాంతో… పేటీఎంలో ఆ కంపెనీకి 3.16 శాతం వాటా మాత్రమే ఉండేది. తాజాగా దాన్ని కూడా అమ్మేసి… పేటీఎంకు గుడ్ బై చెప్పేసింది… అలీబాబా సంస్థ. చివరిగా రూ.1,360 కోట్లు మూటగట్టుకుని వెళ్లిపోయింది. మూడో త్రైమాసికంలో పేటీఎం నష్టాలు గణనీయంగా తగ్గడంతో… ఆ కంపెనీ షేరు క్రమంగా పెరుగుతూ వచ్చింది. దాంతో… సమయం చూసుకుని అలీబాబాతో పాటు మిగతా ఇన్వెస్టర్లు కూడా వాటాలు విక్రయించి పేటీఎంను వదలించుకున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
శుక్రవారం బ్లాక్ డీల్ ద్వారా మొత్తం 2.8 కోట్ల పేటీఎం షేర్లను ఇన్వెస్టర్లు అమ్మేశారు. రూ.645–రూ.655 మధ్య ఈ లావాదేవీలు జరిగినట్లు సమాచారం. బ్లాక్ డీల్ నేపథ్యంలో రూ.640 వరకూ పడిపోయిన షేరు… చివరికి దాదాపు 8 శాతం నష్టంతో రూ. 650 దగ్గర ముగిసింది. పేటీఎం ఐపీవో ఆఫర్ ధర రూ.2,150. ఒక దశలో 78 శాతం దాకా పతనమై పెట్టుబడిదారులకు కన్నీరే మిగిల్చింది… పేటీఎం. ముఖ్యంగా ప్రీ-ఐపీవో ఇన్వెస్టర్లు ఏడాది లాకిన్ పీరియడ్ తర్వాత షేర్లు తెగనమ్మేయడంతో… రూ.474 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరింది. అక్కడి నుంచి మళ్లీ 50 శాతానికి పైగా పెరిగిన పేటీఎం షేరు… తాజా పరిణామాలతో మళ్లీ పతనం దిశగా కొనసాగుతోంది.