Food Items at Airports:దేశంలోని విమానాశ్రయాల్లో ఆహార పదార్ధాలను అధిక ధరలకు విక్రయించడాన్ని… ఓ వ్యక్తి ట్విట్టర్లో ఎండగట్టాడు. విమానయానం మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో… ఎయిర్పోర్టుల్లో ఫుడ్ రేట్లు మాత్రం ఆకాశం నుంచి దిగిరావడం లేదంటూ తీవ్రంగా విమర్శించాడు. రూ.400 పెట్టి ఒక దోశ, రూ.100 పెట్టి ఒక వాటర్ బాటిల్ కొనాలంటే భారంగా ఉందని… అందుకే తాము ఇంటి నుంచి తెచ్చుకున్న ఆలూ పరాఠాను ఆనందంగా ఆరగించామని తన ట్వీట్లో చెప్పుకొచ్చాడు. ఇతర ప్రయాణికులు తమను వింతగా చూసినా తాము ఏ మాత్రం పట్టించుకోలేదన్నాడు. తన జేబు అనుమతించిన మేరకే తాను డబ్బు ఖర్చు చేస్తానని… ఇతరులు కూడా ఈ సూత్రాన్నే పాటిస్తే బాగుంటుందని అతను ఇచ్చిన సలహాకు… చాలా మంది మద్దతు పలుకుతున్నారు.
మాధుర్ సింగ్ అనే వ్యక్తి తన తల్లితో కలిసి గోవా పర్యటనకు వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు వెళ్లాడు. అక్కడి బోర్డింగ్ ఏరియాలో కూర్చుని.. తల్లితో కలిసి ఆలూ పరాఠా తిన్నాడు. అది ఏ ఊరి ఎయిర్పోర్టో చెప్పలేదు గానీ… అక్కడి ఆహార పదార్థాల ధరలపై అతను తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. విమానాశ్రయాల్లో ధరలు అధికంగా ఉంటాయి కాబట్టే తన తల్లి ఆలూ పరాఠా తయారు చేసి తీసుకొచ్చిందని… తాము వాటిని నింబు కా ఆచార్తో కలిపి ఎంతో ఆనందంగా తిన్నామని మాధుర్ సింగ్ తెలిపాడు. తాము ఆలూ పరాఠాను తింటున్న వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన అతను… చుట్టుపక్కల వాళ్లు ఏమనుకుంటాలో ఆని ఫీలవొద్దని సూచించాడు. మీ జీవితాన్ని మీకు నచ్చినట్లు జీవించండి అని చెప్పుకొచ్చాడు.
మాధుర్ సింగ్ పెట్టిన ఈ పోస్టును చాలా మంది సమర్థించారు. తాము కూడా విమానాశ్రయంలోని ఆహార పదార్థాలను కొనేందుకు ఇష్టపడమని, ఎప్పుడు విమాన ప్రయాణం చేయాల్సి వచ్చినా ఇంటి నుంచే ఆహారం తెచ్చుకుంటామని చెప్పుకొచ్చారు. తమ కుటుంబసభ్యులు శ్రద్ధగా ఆహారాన్ని వండి ప్యాక్ చేసి ఇవ్వడాన్ని గర్వంగా భావిస్తామని తెలిపారు. మరికొందరు… ఇప్పటిదాకా తాము ఈ అంశంపై దృష్టిపెట్టలేదని… ఇకపై విమాన ప్రయాణాల సందర్భంగా ఇంటి నుంచే ఆహారాన్ని తీసుకెళ్తామని జవాబిచ్చారు.
Rekha Jhunjhunwala:2 వారాల్లో రూ.1,000 కోట్లు లాభం.. ఎవరికంటే..