Pakistan has taken measures to save energy and electricity: ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతున్న పాకిస్థాన్… ఆలస్యంగానైనా కళ్లు తెరిచింది. దేశమంతా ఇంధనం, కరెంటును పొదుపు చేసేలా కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇవి అమలైతే… భారీగా సొమ్ము ఆదా ఆవుతాయని పాక్ భావిస్తోంది.
అప్పుల కుప్పలా మారిన పాకిస్థాన్ ఇప్పటికే సబ్సిడీల భారాన్ని మోయలేక చాలా వాటికి కోత పెట్టింది. ఇప్పుడు ఇంధన పొదుపు ప్రణాళికలను ప్రకటించింది. దాంతో పాటు చమురు దిగుమతులను తగ్గించేలా పాక్ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. జాతీయ ఇంధన పరిరక్షణ ప్రణాళికను ఆమోదించింది. అందులో భాగంగా మార్కెట్లు, ఫంక్షన్ హాళ్లను నిర్ణీత సమయం కన్నా ముందుగానే మూసివేయబోతోంది. రాత్రి 8:30కు మార్కెట్లు, రాత్రి 10 గంటలకు ఫంక్షన్ హాళ్లు మూసివేస్తే… 60 బిలియన్ల పాకిస్థాన్ రూపాయలు ఆదా అవుతాయని ఆ దేశ మంత్రులు చెబుతున్నారు. ఫిబ్రవరి నుంచి సాధారణ బల్బుల తయారీని, జులై నుంచి నాసిరకం ఫ్యాన్ల ఉత్పత్తిని నిలిపివేస్తామని, దీని వల్ల మరో 37 బిలియన్ల సొమ్ము ఆదా అవుతుందని లెక్కలేస్తున్నారు. ఏడాదిలోపు కేవలం కొనికల్ గీజర్లు మాత్రమే వాడేలా చర్యలు తీసుకుంటామని, దీని వల్ల తక్కువ గ్యాస్ వాడకంతో 92 బిలియన్లు పొదుపు చేసినట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. స్ట్రీట్ లైట్లు మార్చడం ద్వారా మరో 4 బిలియన్లు ఆదా అవుతాయని చెబుతున్నారు. పొదుపు చర్యల్లో భాగంగా కేబినెట్ భేటీని కూడా పగటి పూట వెలుతురులోనే నిర్వహించామని… లైట్లను ఉపయోగించలేదని పాక్ మంత్రులు చెప్పుకొచ్చారు.
ఇక పెట్రోల్, డీజిల్ వాడకాన్ని కూడా తగ్గించేలా ఈ ఏడాది చివరికల్లా దేశంలో ఎలక్ట్రిక్ బైక్లను తీసుకువస్తామని పాక్ ప్రకటించింది. దీని వల్ల పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని చెప్పింది. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ఇన్ని తంటాలు పడుతున్న పాకిస్థాన్… ఇండియాతో కయ్యానికి కాలు దువ్వకుండా ఉంటే… అన్ని పొదుపు చర్యలకన్నా ఎక్కువ సొమ్మే మిగులుతుందని… భారతీయులు సెటైర్లు వేస్తున్నారు.