Offering sweet to God : దేవుళ్లకు సమర్పించే పదార్థాలలో నైవేద్యం కచ్చితంగా ఉంటుంది. ఎవరి శక్తి కొద్దీ వారు దేవుడికి ఉన్నంతలో పండో కాయో, పిండి వంటో ప్రసాదంగా పెడుతుంటారు. కొంతమంది ప్రత్యేకమైన వంటలు చేసి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. . అయితే అందులోనూ తీపి పదార్థాలను ఎక్కువగా సమర్పిస్తారు. వీటిని రుచి చూసేందుకు దేవతలందరూ ఆహ్వానించబడతారు. ఎవరైతే భక్తులు భక్తి శ్రద్ధలతో వీటినన్నింటినీ సమర్పిస్తే దేవుళ్ల అనుగ్రహం కచ్చితంగా లభిస్తుంది.
దేవుళ్లను ఆరాధించే సమయంలో కొబ్బరికాయతో పాటు పండ్లను కూడా కచ్చితంగా సమర్పించాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం దానిమ్మ పండ్లను, విష్ణుమూర్తికి అరటి పండ్లను సమర్పిస్తారు. ఇలా పండ్లను సమర్పించడం వల్ల మానసికంగా బలం పెరుగుతుందని, ఆధ్యాత్మిక పరిపక్వత పొందే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు. నిల్వదోషం లేని పదార్థం ఏదైనా ఉందంటే అది బెల్లమే. అందుకే బెల్లం ముక్క పెట్టుకుండా నైవేద్యం పెట్టుకో కూడదు. ఈశ్వరునికి నివేదించే ప్రసాదాల్లో పంచదార వేయరు. బెల్లం మాత్రమే వేయడానికి కారణం ఇదే. ప్రసాదంగా పండు, కాయ ఏది పెట్టినా బెల్లం కూడా పెట్టాలి. బెల్లంతో చేసిన అన్నాన్ని సరస్వతి దేవికి నైవేద్యంగా పెట్టి తరువాత పిల్లలకు పంచితే కోరిన కోరికలు నెరవేరతాయని పరిహారశాస్త్రం చెబుతోంది. ఇలా చేయడం వల్ల అనుకున్న పనులు జరుగుతాయి. మంచి జ్ఞాపక శక్తి కలుగుతుంది.
దేవునికి నివేదించే పదార్ధాలు శుచి, శుభ్రంగా మడి బట్టలు కట్టుకొని వండి నివేదించాలి. నిలువ వున్న తీపి పదార్ధాలు నివేదించ కూడదు.. పండుగ రోజుల్లో దేవునికి పటిక బెల్లం నివేదించి ఆ పొడి ని తీపి పదార్ధాలపై జల్లి తీపి పదార్ధాలు పంచడం మంచిది. సాధ్యమైనంత వరకు ఏ పదార్థమైన శుచితో, శుభ్రతతో మనకు ఉన్న శక్తిమేరకు ఇంట్లోనే చేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. దీనివల్ల అనేక శుభాలు, ఆరోగ్యం లభిస్తుంది.