Not in thousands.. layoffs in lakhs.. : ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగులంతా బిక్కుబిక్కుమంటూ విధులకు హాజరవ్వాల్సిన పరిస్థితులే ఉన్నాయి. ఎందుకంటే… ఆదాయం తగ్గిపోవడం, మాంద్యం భయాలతో బడా కంపెనీల దగ్గరి నుంచి చిన్న సంస్థల దాకా అన్నీ ఉద్యోగుల్ని భారీ సంఖ్యలో తీసేస్తున్నాయి. దాంతో… ఏ క్షణం ఉద్యోగం ఊడిందనే వార్త వినాల్సి వస్తుందోనని ఉద్యోగులంతా తీవ్ర భయాందోళనలో ఉన్నారు.
ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 853 టెక్ కంపెనీలు లక్షా 37 వేల మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపాయని ఓ సంస్థ తన నివేదికలో తెలిపింది. అదే కొవిడ్ మొదలైనప్పటి నుంచి చూసుకుంటే… ఈ సంఖ్య ఏకంగా 2 లక్షల 33 వేలు అని ఆ సంస్థ షాకింగ్ విషయం బయటపెట్టింది. కొవిడ్ దెబ్బకు కుదేలైపోయామని నిన్న మొన్నటి దాకా కోతలు పెట్టిన సంస్థలన్నీ, ఇప్పుడు ఆర్థిక మాంద్యం సాకుతో ఉద్యోగుల్ని ఇష్టానుసారం పీకేస్తున్నాయని క్రౌడ్సోర్స్ డేటాబేస్ ఆధారంగా రూపొందించిన నివేదికలో layoffs.fyi తెలిపింది. ఒక్క నవంబర్ నెలలోనే అమెరికాకు చెందిన టెక్ కంపెనీలు 73 వేల మందిని ఇంటికి పంపాయని నివేదిక పేర్కొంది. ఇందులో మెటా, ట్విటర్, సేల్స్ ఫోర్స్, నెట్ఫ్లిక్స్, సిస్కో, రోకు వంటి కంపెనీలు ఉన్నాయి. ఇదే బాటలో అమెజాన్, హెచ్పీ కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టాయి.
ఇక ఇండియాలోనూ 44 స్టార్టప్ కంపెనీలు దాదాపు 16 వేల మంది ఉద్యోగుల్ని తొలగించాయి. ఇందులో బైజూస్, అన్ అకాడమీ, వేదాంతు, ఓలా, కార్స్ 24, మీషో, లీడ్, ఎంపీఎల్ వంటి స్టార్టప్ కంపెనీలులు ఉన్నాయి. వివిధ కంపెనీల్లో వేల మంది కాంట్రాక్ట్ సిబ్బంది కూడా ఉద్యోగాలు కోల్పోయారు. వచ్చే ఏడాది కూడా ఈ కోతలు తప్పవనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అందుకే ఎవరి జాగ్రత్తలో వాళ్లు ఉండాలని చెబుతున్నారు… విశ్లేషకులు.